గుంటూరు జిల్లా చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే , సీనియర్ వైకాపా నేత మర్రి రాజశేఖర్ కు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన రెండు హామీల్లో ఒకటి నెరవేరుస్తున్నారు. ఎన్నికల ముందు వైకాపాలో చేరిన ఎన్ఆర్ఐ విడతల రజని కోసం మర్రి రాజశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని త్యాగం చేశారు. ఈ సందర్భంలో జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. దీనితో పార్టీని వీడటానికి సైతం సిద్ధపడ్డ రాజశేఖర్.. విభేదాలను పక్కన పెట్టి ఎన్నికల్లో విడతల రజని గెలుపునకు కృషి చేశారు. ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావుపై విడతల రజని విజయం సాధించారు. కాగా 2004 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుండి పత్తిపాటి పుల్లారావుపై కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మర్రి రాజశేఖర్ 2009, 2014 ఎన్నికల్లో పత్తిపాటి పుల్లారావు పైనే పరాజయం పాలయ్యారు. 2009 కాంగ్రెస్ తరపున, 2014లో వైకాపా తరపున మర్రి పోటీ చేశారు. 2014 ఎన్నికల తరువాత మర్రి వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నియమితులు అయ్యారు.
మండలి రద్దు లేనట్టేనా?
శాసనమండలి రద్దు చేయకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే మర్రి రాజశేఖర్ కు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని నెరవేరుస్తున్నారని అనుకుంటున్నారు. గవర్నర్ కోటాలో మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీగా ఎంపికకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీ సంఖ్య బలం ఎక్కువ ఉండటంతో పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించకుండా సెలెక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో ఆవేశంతో జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తేలిసిందే. అనుకున్నదే తడవుగా మంత్రి మండలిలో తీర్మానం కూడా చేయడం, అసెంబ్లీ ఆమోదించడం కేంద్రానికి పంపించడం చెకచెకా జరిగి పోయాయి. అయితే కేంద్రం ఇంత వరకు మండలి రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో మండలిలో వైసీపీ సంఖ్య బలం పెరుగుతున్న నేపథ్యంలో మండలి కొనసాగింపునకే జగన్ సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
మంత్రి పదవీ ఇస్తారా?
ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ దాదాపు 30 మందికి ఎమ్మెల్సీ, మంత్రి పదవు లంటూ హామీలు ఇచ్చారు. చాలా మంది ఎమ్మెల్సీ పదవులపై, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే మంగళగిరిలో నారా లోకేష్ పై పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి, చిలకలూరిపేట లో మర్రి రాజశేఖర్, రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి వెంకట రమణ కు మంత్రి పదవులు ఇస్తానని జగన్ నాడు బహిరంగ సభల్లోనే హామీ ఇచ్చారు. తొలి సారి మంత్రి వర్గంలోనే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి లభిస్తుందని ఆ పార్టీ ముఖ్య నేతలు భావించారు. ముందుగానే ఆయనకు పలువురు శుభాకాంక్షలు కూడా చెప్పారు. అయితే కులాలు, ప్రాంతాలు, సీనియారిటీ తదితర ఈక్వేషన్ ల కారణంగా చాలా మందికి అవకాశం లభించలేదు. మోపిదేవి వెంకట రమణ ఎన్నికల్లో పరాజయం పాలైనా విధేయత కారణంగా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ గా నామినేట్ చేశారు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభ కు ఎన్నికైనందున త్వరలో ఈ రెండు మంత్రి పదవుల భర్తీ జరగనుందని అనుకుంటున్నారు. మోపిదేవి స్థానంలో ఎమ్మెల్సీగా మర్రి నామినేట్ అవుతున్నందున మంత్రి పదవి హామీ కూడా నెరవేర వచ్చేమో చూద్దాం.