ఏం జరుగుతుంది నియోజకవర్గంలో..? అని ఎవరూ పట్టించుకోరు. ఎందుకిలా చేశారు..? అని ఎవరూ అడగడం లేదు. పార్టీ వ్యక్తులపైనే కేసులేంటి, పిర్యాదులేంటి..? అని ఎవరూ ఆరా తీయరు…! అందుకే ప్రకాశం జిల్లా చీరాలలో సిల్లీ రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. ఎమ్మల్యే, మాజీ ఎమ్మెల్యే నేరుగా విమర్శించుకున్నారా..? లేదు. ఇద్దరూ పరోక్షంగా కవ్వించుకున్నారా? లేదు. ఒకరిపై ఒకరు పెద్దగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవట్లేదు. ఒకే పార్టీ కదా, కట్టుబడి ఉంటున్నారు. కానీ వారి వెనుక ఉన్న కొమ్మలు మాత్రం నరుక్కుంటున్నారు. ఇది పార్టీకి చేసే చేటుని ఆలోచించడం లేదు. ఇటీవల రెండు వర్గాలుగా మారడంతో పార్టీకి కొత్త చిక్కులు వచ్చి, సొంత పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టె పరిస్థితి వచ్చింది.
కరోనా సాయంపై రాజకీయమా….?
“వైకాపా నాయకుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ని ఈ మధ్య పోలీసులు పిలిచి మందలించారట. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు, కూరగాయలు, తదితరాలు అధిక ధరలకు అమ్ముతున్నట్టు పిర్యాదులు వచ్చాయట.” సరే… ఇది జరిగిందో, లేదో తర్వాత చెప్పుకుందాం. కానీ ఈ పిర్యాదు ఇచ్చింది టిడిపి కాదు. వైసీపీ నాయకులే. ఈ మధ్య అనధికారికంగా వైసిపిలో చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం ఈ పిర్యాదు చేశారు.
* ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే… కరోనా నేపథ్యంలో నియోజకవర్గంలో “మొబైల్ రైతు బజార్” నిర్వహించి పేదలకు తక్కువ ధరలకు నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నారు. దీన్ని సహించని అదే పార్టీలోని ప్రత్యర్ధులు ఎమ్మెల్యే కరణం వద్ద లంకె పెట్టుకున్నారు. ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. దీని ఫలితం, పేదలకు సాయం నిలిచిపోవడం. మరో వైపు రోగ నిరోధక శక్తి అందించేందుకు నియోజకవర్గంలో పేదలకు అరటి పళ్ళు ఉచితంగా అందించారు. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి నేతృత్వంలో జరుగుతున్నాయి.
* ఇక్కడే కరణం బలరాం, ఆయన కుమారుడు కూడా అడపాదడపా కరోనా పేరిట సాయం చేస్తున్నారు. ఆయన వర్గీయులు తిరుగుతున్నారు. అంటే ఇరువర్గాలు కరోనా సాయాలు చేస్తున్నా… ఏఎంసీ చైర్మన్ పై పిర్యాదు చేయడం, మొబైల్ రైతు బజార్ ని ఆపించేయడం పేదలకు చేటు చేసినట్టే మారింది.
* నిజానికి కరోనా ఆపత్కాలం లో ఇక్కడ ఇద్దరు నాయకులు చెరో దారిన సాయం చేస్తూ ఉండొచ్చు. తమ తమ వర్గాలతో కలిసి పేదలను ఆదుకోవచ్చు. స్థానిక పోరుకి ముందు ఇది మంచి అవకాశమే. కానీ కొత్తగా పార్టీలో చేరిన కరణం అండతో మాజీ మంత్రి పాలేటి రామారావు, ఎప్పటి నుండి వైసిపిలో ఉన్న అమృతపానీ వంటి నాయకులు కాస్త శృతిమించిన రాజకీయాలు చేస్తున్నారు. మొదటి నుండి ఆమంచి వ్యతిరేక వర్గీయులుగా ఉన్న వీళ్ళు కొన్ని విషయాల్లో కరణంను కూడా పక్కదారి పట్టిస్తున్నారని స్థానికంగా వినిపిస్తుంది.
బాలినేని ఓ సారి చూడొచ్చుగా…!
ఒకే వరలో రెండు కత్తులు ఇమడవు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వంటి బలమైన నాయకత్వం ఉండగానే ఇక్కడ ఎమ్మెల్యే కరణం బలరాం ని తీసుకొచ్చి పార్టీలో చేర్చారు. పెత్తనాలు మాత్రం ఆమంచికే అని హామీ ఇచ్చారు. అంటే ఇక్క పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలూ ఇంఛార్జిగా అమలు చేయాల్సింది ఆమంచి కృష్ణమోహన్. కాకపోతే ఒక ఎమ్మెల్యేగా కరణం బలరాం కూడా సహకరించాలి, అధికార కార్యక్రమాలూ చూసుకోవాలి. ఇద్దరూ కలిసి పని చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఆ అవకాశం లేదు. ఎన్నికల నాటి నుండి కరణం తో పాటూ చేరిన వర్గం ఇప్పుడు వైసిపిలో ఆమంచి వ్యతిరేక వర్గంగా మారింది. చేస్తున్న మంచిని కూడా చెడుగా చూపిస్తూ నానాయాగీ చేస్తుంది. దీన్ని ఆరంభంలోనే పరిష్కరించకుంటే తీవ్ర నష్టం తప్పదు. నాడు కరణం పార్టీలో చేరడం… తర్వాత రోజున ఆమంచిని తీసుకుని జగన్ ను కలవడం… తప్పితే ఇప్పటి వరకు ఇక్కడి రాజకీయాలపై బాలినేని పట్టించుకున్నది లేదు. సరే… ఆయన చేసేదేం లేకపోయినా నాయకులు చేసే మంచిని అడ్డుకోకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇదే ఇక్కడ చర్చనీయాంశం. చీరాలలో ద్వితీయ వర్గంగా కరణంతో చేరిన పాలేటి రామారావు, అమృతపాణి, పోతుల సునీత వంటి వారిని నియంత్రిస్తే పార్టీకి కొంత మేలు జరిగినట్టే. పార్టీకి పెద్దగా ఉపయోగం లేకుండా, ప్రజాపయోగమైన కార్యకలాపాలను కూడా అడ్డుకోవడం సమస్యగా మారుతుంది. బాలినేని ఓ సారి చూడొచ్చుగా..!