టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి సారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ట్రైల్ పార్టీనెే ఇలా ఉంటే క్లైమాక్స్ ఎలా వుంటుందో ఊహించు కోవాలంటూ చేసిన వ్యాఖ్యలపై అమంచి ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు హయాంలో కరోనా వచ్చుంటే..
చంద్రబాబు హయాంలో కరోనా వచ్చి ఉంటే అధికారుల్ని పనిచేయనీయకుండా రూములో కూర్చోబెట్టి సోది చెప్పి హింసించేవారని అమంచి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా చీరాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమంచి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కేరళ తర్వాత రెండో స్థానంలో నిలిచిందని దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థతే కారణమని పేర్కొన్నారు. అయితే కేరళ రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యతతో పాటు వైద్యపరంగా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయనీ, ఆ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తెలివి, కృషి ,ముందుచూపు, సమర్థతతో కరోనాను కట్టడి చేసి వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడాడని అమంచి ప్రశంసించారు. గత సంవత్సర కాలంగా ఏ ప్రజా సమస్యపైనా కనీసం స్పందించే అవకాశం చంద్రబాబుకు ఇవ్వకుండా ప్రజల ఇంటి ముంగిటికే పథకాలు అందించడం ద్వారా జగన్ విప్లవాత్మక పరిపాలన సాగించారని అన్నారు. చివరికి కరోనా సాకుతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడని ఆమంచి విమర్శించారు.
భవిష్యత్ లో లోకేష్ ఎమ్మెల్యే కాలేడు
ప్రజా క్షేత్రంలో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచే సత్తా నారా లోకేష్ కు లేదనీ, భవిష్యత్తులో నారా లోకేష్ ను ఎమ్మెల్యే చేయాలనుకుంటే చంద్రబాబు జగన్ కాళ్లు పట్టుకుని వైఎస్ఆర్ సిపి బీఫారం సంపాదిస్తేనే సాధ్యమవుంటుందని ఆమంచి వ్యాఖ్యానించారు.
ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్ లు
రాష్ట్రంలోని ప్రజలందరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా వాలంటీర్ లు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్ది అందిస్తున్న జనరంజక పాలన వల్ల రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్ లేదని అన్నారు.