రెండు దశాబ్దాల సస్పెన్స్ కు తెర పడింది. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ విషయంలో రజినీ కంటే ఆయన ఫ్యాన్స్ కే ఆరాటం ఎక్కువ. వారి డిమాండ్, ఉత్సాహంపై రజినీ ప్రతిసారీ నీళ్లు చల్లేస్తూనే ఉన్నారు. చివరికి.. జయలలిత, కరుణానిధి మరణించాక పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే.. సినీ ఛరిష్మా నేటి రాజకీయాల్లో ఏమేర ప్రభావం చూపిస్తుందనేది ప్రశ్నార్ధకమే. రజినీ ఒక్క దెబ్బ కొడితే వంద మంది రౌడీలు గాల్లోకి ఎగిరిపోతారు. కానీ.. పాలిటిక్స్ లో వంద మంది ఢీ కొడతారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నేర్పిన పాఠం ఉండనే ఉంది. రజినీ దీనిని చదివి నేర్చుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరొచ్చు.
సరైన సమయమే.. కానీ
తమిళనాడు రాజకీయాలు వేరు. ఇద్దరు రాజకీయ ఉద్దండులు, రెండు ద్రవిడ పార్టీల మధ్యే దశాబ్దాలపాటు ఆధిపత్యం నడిచింది. ప్రజలు వారికి అలవాటు పడిపోయారు. వారిప్పుడు లేకపోయినా పార్టీలు ఉన్నాయి. ఫేస్ వాల్యూ లేని పార్టీల కంటే తన ఫేస్ వాల్యూతోనే పార్టీ పెట్టి సీఎం కావాలని భావిస్తున్నారు రజినీకాంత్. స్థానికతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తమిళ ప్రజలు మరాఠీ అయిన రజినీని ఒప్పుకోకపోయే పరిస్థితులు లేవు. ఎంజీఆర్ మళయాళీ.. శ్రీలంకలో పుట్టారు. జయలలిత తమిళ బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. రజినీకాంత్ మరాఠీ బెంగళూరులో పుట్టారు. కాబట్టి స్థానికత పెద్ద అంశం కాదు. సినిమాలు చూస్తున్నారు.. ఓట్లు కూడా వేసేస్తారు అనుకోవడానికి లేదు. నేటి రోజుల్లో ఇవన్నీ పనికిరావని ప్రూవ్ అయ్యాయి కూడా.
రజినీ తట్టుకోవాల్సినవీ ఉన్నాయి..
తమిళ రాజకీయాల్లో సినీ ప్రభావం ఎక్కువ. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి సినీ నేపథ్యం నుంచి వచ్చి సీఎంలు అయ్యారు. అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు. ఫ్యాన్స్ కార్యకర్తలవ్వాలి, ప్రేక్షకులు ఓటర్లవ్వాలి, సినీ జిమ్మిక్కులు వాస్తవంలోకి రావాలి. క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలి. కధానాయకుడిగా ఇప్పటివరకూ చూసిన ప్రతిపక్ష పార్టీలు ఎదురుదాడి చేస్తాయి. విమర్శలు చేస్తాయి. బలంగా సమాధానం చెప్పాలి. వేదాంతం పనికిరాదు. శత్రువులు పెరుగుతారు. పార్టీ ఫిరాయింపులు, నియోజకవర్గ బాధ్యతలు, సీట్ల పంపకం, ఫ్యాన్స్ కు ప్రాముఖ్యం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుతం రజినీ ఈనెలలోనే 70వ ఏట అడుగుపెడుతున్నారు. ఏసీ గదుల నుంచి ఎండల్లోకి రావాలి. ప్రజల్లోకి వెళ్లాలి. అయితే.. రజినీ వీటన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే బరిలో దిగుతున్నారని అంటున్నారు. మరి రజినీ ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి.