ఆర్టర్నేటివ్ అవుతారనుకుంటే…
మెగాస్టార్ చిరంజీవి… తెలుగు తెర ఇలవేల్పు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతకంటే… అంతకు మించి పాపులార్టీ ఉన్న దిగ్గజ నటుడు. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి… కొత్త ట్రెండ్ సృష్టించారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే అధికారంలోకి వచ్చేయాలన్న కసితో నాడు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటయ్యింది. అయితే నాడు వైఎస్ స్టామినా ముందు… చిరంజీవి ప్రజారాజ్యం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ 17 శాతం ఓట్లను కొల్లగొట్టింది. 18 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దాంతో టీడీపీ, బీజేపీకి చిరంజీని ఆల్టర్నేటివ్ అవుతారని అందరూ భావించారు. కానీ వైఎస్సార్ అకాల మరణం, రాష్ట్ర విభజన పరిణామాలతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు.
సైలెంట్ రోల్ పోషించిన చిరు
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి అనుకున్న విధంగా పరిణామాలు చోటుచేసుకోలేదు. తనకు కనీసం కేబినెట్ హోదా కూడా ఇవ్వలేదు. పైపెచ్చు… రాష్ట్రంలో మంత్రి పదవులిచ్చినా అది కూడా నామ్ కే వాస్త్ గా మారిపోయాయ్. చివరకు ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ లోకి విలీనమయ్యాక పూచిక పుల్లతో సమానంగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి మౌనం దాల్చారు. తప్పుడు జనసేన పార్టీ ఏర్పాటు చేసి అటు కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పినా… చిరు మాత్రం మూకీ సినిమాతో కాలం గడిపేశారు.
ఇద్దరు సీఎంలతో కలవిడిగా చిరు
కట్ చేస్తే ఐదేళ్లు గడిచిపోయాయ్. ఏపీలో చంద్రబాబు ఎన్నికల్లో చిత్తయ్యాడు. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ విజయం సాధించారు. దీంతో రెండు చోట్ల… ఇద్దరూ సీఎంలకు ప్రతికూల వైఖరి లేకుండా స్తబ్దుగానే ఉంటూ… ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చిరంజీవి కోరస్ పాడుతూ వచ్చారు. ఇటీవల ఇద్దరు సీఎంలను కలవడం… సినీ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడం… అదే సమయంలో వైజాగ్ కేపిటిల్ అంశానికి మద్దతు పలకడం చేసిన చిరంజీవి ఇప్పుడు కొత్త స్టాండ్ తీసుకోబోతున్నట్టుగా కన్పిస్తోంది. ఏంటా స్టాండ్… ఏంటా వ్యూహమనుకుంటున్నారా?
అది కాంగ్రెస్ పార్టీ బలం కాదు…
రాజకీయ విశ్లేషకులు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. రాజకీయాల్లో హత్యలుండవని… కేవలం ఆత్మహత్యలే ఉంటాయంటారు… ఎవరికి ఎప్పుడు కాలం ఎలాంటి పనిష్మెంట్ ఇస్తుందో కాలమే నిర్ణయిస్తుంది. అప్పటి వరకు హీరోలు.. అకస్మాత్తుగా జీరోలైపోతారు… జీరనుకున్నవారు హీరోలైపోతారు. మొత్తంగా ఎప్పుడు రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడం ఎవరి తరమూ కాదు… కాంగ్రెస్ పార్టీ దేశంలో పదేపదే ఎందుకు అధికారంలోకి వస్తుందంటే… సీనియర్ విశ్లేషకులు ఒక్కటే చెబుతారు.. అది కాంగ్రెస్ పార్టీ బలం కాదని… ప్రధాన పార్టీల బలహీనత మాత్రమేనంటారు…
చిరంజీవికి కీలక పదవి
ఇక ఇప్పుడు చెప్పొచ్చేదేంటంటే… మెగాస్టార్ చిరంజీవి, వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవుతారన్న ప్రచారం జరిగింది. ఆ రోజు ఆ పనిచేసి ఉంటే బాగుండేమో… అనవసరం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఛాన్స్ ఇచ్చేశారు. ఆయన ఒప్పుకోకున్నా… బతిమాలో… బామాలో ఎంపీని చేసి పెట్టి ఉంటే.. అది వచ్చే రోజుల్లో వైసీపీకి చాలా ప్లస్ అయ్యేది. కానీ ఇప్పుడు అదే చిరంజీవిని అడ్డుపెట్టుకొని ఏపీలో బీజేపీ కొత్త గేమ్ ఆడితే… అది చివరాకరకు ఇబ్బంది కలిగించేది కేవలం జగన్ సర్కారుకే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పనులు చేసినా… కేంద్రం ఇంప్రషన్ చాలా ముఖ్యమే. అవసరమైతే… వచ్చే కేబినెట్ రీషఫుల్ లో చిరంజీవిని కేబినెట్లోకి తీసుకొని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందనేది రాజకీయ వర్గాలు అంచనా… సో ఎనీథింగ్ హ్యాపెన్స్ అన్న మాట…