MP RRR: ఏపీ ప్రభుత్వం పాలిట కొరకరాని కొయ్యగా మారిన ఎంపీ రఘురామకృష్ణ రాజు.. సీఎం జగన్ పై రోజుకో కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ నాయకులు అటు ఢిల్లీలో, ఇటు ఏపీలో కూడా రఘురామను నిలువరించలేక పోతున్నారు. ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏపీలో జరుగుతున్న పరిణామాలను ఎండగడుతున్నారు. ఢిల్లీలోనే ఉంటూ.. సొంత నియోజకవర్గానికి రాని రఘురామ సంక్రాంతి పండుగ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నట్టు స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ పోలీసులు రఘురామను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. రేపు విచారణకు రావాలని రఘురామకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఎంపీ సవాల్..
గత ఏడాది దేశద్రోహం కేసులో సీఐడీ పోలీసులు (MP RRR) రఘురామకు నోటీసులు ఇవ్వడం, విచారణ సందర్భంలో జరిగిన సంఘటనలు తెలిసిందే. అయితే.. ప్రస్తుతం రఘురామ ఏపీకి వస్తున్నాని సంక్రాంతికి రెండు రోజులు సొంత ఊరిలో ఉంటాను.. రక్షణ ఇవ్వండని కోరారు. తనపై అనర్హత వేయించడానికి ఫిబ్రవరి 5వరకూ వైసీప నేతలకు సవాల్ చేశారు. లేదంటే తాను రాజీనామా చేసి అమరావతి రాజధాని రిఫరెండంగా ఇండిపెండెంట్ గా ఉప ఎన్నికకు వెళ్తానని అన్నారు. ఈనేపధ్యంలో నోటీసుల వ్యవహారం కలకలం రేపుతోంది. అయితే.. ఉన్నట్టుండి ఆయనకు నోటీసులు ఇవ్వడం.. రేపు విచారణకు రావాలని ఆదేశించడం వెనుక రఘురామను ఏపీకి రాకుండా చేయాలనేనా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
కావాలనే చేస్తున్నారా..
(MP RRR) తనకు ఏ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చారో తెలపలేదని రఘురామ అంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయన్ను అరెస్టు చేసే అవకాశం లేదు. కేవలం.. ఆయన నరసాపురం వెళ్లకుండా అడ్డుకునేందుకే పోలీసులు నోటీసులిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సవాల్ విసరడం, ప్రభుత్వ విధానాలపై ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో సొంతూరికి వస్తే.. ఆయనపై సానుభూతి పవనాలు వ్యక్తం కావడం.. మీడియా ఇంటరాక్షన్ జరిగి మరింతగా ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే.. రఘురామ విచారణకు జనవరి 17న వస్తానని చెప్పడం విశేషం. ఈ అంశంలో మరెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాల్సి ఉంది.