(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మూడు రాజధానుల ఏర్పాటు నేపథ్యంలో వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ సీ ఆర్ డీ ఏ రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములు ఇచ్చిన ఇద్దరు ప్రముఖులు నేడు రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టును ఆశ్రయించడంతో కొత్త వివాదం వచ్చి పడినట్లు అయ్యింది.
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు సినీ నిర్మాత అశ్వనీదత్ 40 ఎకరాల భూమి, అదే విధంగా సినీ నటుడు కృష్ణంరాజు ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా భూసమీకరణ కింద అశ్వనీదత్ ప్రభుత్వానికి భూమి ఇచ్చారు. అశ్వనీదత్ ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్ డీఏ పరిధిలో భూకేటాయింపులు జరిగాయి. నేడు జగన్మోహనరెడ్డి ప్రభుత్వం సీఆర్ డీఏ పరిధి నుండి రాజధానిని తప్పించిన నేపథ్యంలో అగ్రిమెంట్ ను ప్రభుత్వం ఉల్లంఘించిందంటూ అశ్వనీదత్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ఇచ్చిన భూమి తనకు ఇవ్వాలనీ లేకుంటే భూసేకరణ కింద నాలుగు రెట్లు నష్టపరిహారంగా 210 కోట్లు ఇవ్వాలంటూ అశ్వనీదత్ వ్యాజ్ఞం దాఖలు చేశారు. తన నష్టపరిహారం తేలే వరకుూ విమానాశ్రయ విస్తరణ పనులు ఆపేయాలని అశ్వనీదత్ కోరుతున్నారు.
అదే విధంగా సినీ నటుడు కృష్ణంరాజు కూడా పోర్టు విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసు జారీ చేస్తూ కేసును వచ్చే సోమవారంకు వాయిదా వేసింది.