ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన అంశం ‘పంచాయతీ ఎన్నికలు’. దాదాపు ఏడాదిగా ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం ఎప్పటికప్పుడు కొత్త సంచలనాలకు వేదిక అవుతోంది. అల్లు అర్జున్ దేశముదురు సినిమాలో ఆలీ అన్నట్టు.. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వేసే ప్రతి ఎత్తుకు సీఎం జగన్ పైఎత్తు వేస్తున్నారు. జగన్ వేసే పైఎత్తుకు నిమ్మగడ్డ అంతకుమించి పైఎత్తు వేస్తున్నారు. ఇలా.. ఒకరికొకరు తమ బలాల్ని, తమ అధికారాన్ని ఉపయోగిస్తూ నువ్వా-నేనా అనేట్టు పోటీ పడుతున్నారు. 2020 మార్చి నెలలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ స్థానిక ఎన్నికలన వాయిదా వేశారు. అప్పటి నుంచి రాజుకుంటున్న నిప్పురవ్వలు ఇప్పుడు అగ్నీ కీలలయ్యాయి.
ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ..
గత మార్చిలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి కరోనా కారణం చూపి ఎన్నికలను వాయిదా వేసారు ఎస్ఈసీ. దీంతో సీఎం జగన్ ఎస్ఈసీ ఏకపక్ష నిర్ణయంపై మండిపడ్డారు. నిమ్మగడ్డపై సామాజికవర్గం పేరుతో ఆరోపణలు చేసి టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. దీంతో అగ్గి ఓస్థాయిలో రాజుకుంది. నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు 2018లోనే జరగాల్సి ఉన్నా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం పూనుకోలేదు. ఎన్నికల కమిషన్ కూడా ముందుకు వెళ్లలేదు. ఎన్నికలకు ప్రభుత్వం భయపడుతోందని ఆరోపిస్తున్న టీడీపీపై వైసీపీ నాయకులు ఎదురు కౌంటర్ వేస్తున్నారు. అప్పట్లో మీరెందుకు ఎన్నికలకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తున్నారు. కరోనా తీవ్రత ముదరకముందే ఎందుకు రద్దు చేశారనేది వారి ప్రశ్న. నిజానికి ఎస్ఈసీ వాయిదా వేసిన సమయంలో కరోనా తీవ్రత అంతగా లేదు. అందుకే.. ఎస్ఈసీ టీడీపీకి అనుకూలంగా.. చంద్రబాబు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇలా ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయం.. ఇలా ఏపీ పంచాయతీ ఎన్నికల అంశం ట్రాయాంగిల్ పొలిటికల్ స్టోరీలా మారిపోయింది.
ప్రభుత్వం x ఎస్ఈసీ.. ఎత్తుకు పైఎత్తులు ఇలా..
- 2020 మార్చి.. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా కేసులను చూపి ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేశారు.
- సామాజికవర్గంపై ప్రేమతో ఎస్ఈసీ నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా.. చంద్రబాబు చెప్పినట్టు నడుస్తున్నారని సీఎం జగన్ ఆరోపణ
- 2020 ఏప్రిల్.. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ ద్వారా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఉద్వాసన పలికిన రాష్ట్ర ప్రభుత్వం.
- వెంటనే.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తమిళనాడుకు చెందిన రిటైర్డ్ జడ్జి లోకేశ్ కనగరాజ్ ను నియమించిన ప్రభుత్వం
- 2020 మే.. ఎస్ఈసీగా నిమ్మగడ్డను తప్పిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ను కొట్టేసిన హైకోర్టు. లోకేశ్ కనగరాజ్ నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు.
- వెంటనే విధుల్లో చేరుతున్నట్టు నిమ్మగడ్డ ప్రకటించడంపై వివాదం. హైకోర్టు తీర్పులో సాంకేతిక లోపాలున్నాయంటూ సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
- 2020 జూన్.. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో తన సామాజికవర్గ బీజేపీ నేతలతో నిమ్మగడ్డ భేటీ ఓ సంచలనం. నిమ్మగడ్డపై జగన్ చేసిన సామాజికవర్గ ఆరోపణలకు బలం.
- 2020 ఆగష్టు.. కోర్టు తీర్పుల అనంతరం తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
- 2020 డిసెంబర్.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించాలంటూ అప్పటి సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాసిన నిమ్మగడ్డ.
- వరుస భేటీల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేం అంటూ నీలం సాహ్ని ప్రకటన
- 2021 జనవరి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ కొత్త సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు లేఖ.. భేటీ. కుదరదన్న ప్రభుత్వం
- 2021 జనవరి 8.. ఫిబ్రవరి 4 నుంచి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయంటూ ఎస్ఈసీ సంచలన ప్రకటన.. షెడ్యూల్ విడుదల
- 2021 జనవరి 11.. కరోనా వ్యాక్సిన్ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్ జడ్జి. ఎస్ఈసీ ఆదేశాలు కొట్టివేత
- 2021 జనవరి 20.. సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. పంచాయతీ ఎన్నికలు నిర్వహించొచ్చని తీర్పు.
సుప్రీంకోర్టు తీర్పు.. ఎలా ఉంటుందో?
మొత్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. హైకోర్టులో ‘పంచాయితీ’ ముగిసింది. దాదాపు ఏడాది మలుపుల తర్వాత పంచాయతీ ఎన్నికల బాల్ సుప్రీంకోర్టులో పడింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ ఇద్దరూ తమ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. సుప్రీం తీర్పును ఇద్దరిలో ఎవరో ఒకరు పాటించాల్సిందే. మరి సుప్రీం తీర్పే ఫైనల్ కానుందా.. లేక ఇద్దరూ కొత్త ట్విస్టులేమైనా ఇస్తారా? అనేది చూడాలి.