అమరావతి, జనవరి 28: ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్వహించనున్న సమ్మెకు పరోక్ష మద్దతు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, బంద్ వల్ల ఇబ్బంది లేకుండా మిగిలిన రోజుల్లో జన్మభూమి సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. రానున్న ఖరీఫ్ సీజన్కు ఏం చేయగలుగుతామో అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాలకు కొత్తగా 10 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రకృతి సేద్యంపై దావోస్లో చర్చ జరిగిందని ఆయన తెలిపారు.
అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన చెప్పారు. జన్మభూమి – మా ఊరులో వచ్చిన సమస్యలను పరిష్కరించాలనీ, ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలనీ ఆయన అన్నారు.