జగన్ మంత్రివర్గంలో ఏం జరుగుతోంది? బాబు అనుకూలంగా ఎంతమంది ఉన్నారు? జగన్ మంత్రివర్గంలో ఉంటూ జగన్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారా? అంతర్గత చర్చలను, సమావేశ వివరాలను బాబు అనుకూల మీడియాకు ఎవరు చేరవేస్తున్నారు?.. ఇవన్నీ పెద్ద సందేహాలుగా మారాయి. నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోవడం సీఎం జగన్ కు పెద్ద కష్టమేమీ కాదు. కానీ.. మరికొన్నాళ్లు ఈ వ్యవహారంపై వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నిజానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకులతో, వారి అనుకూల మీడియాతో సంబంధాలున్న వారు ఉంటారు. అయితే.. జగన్ అనుభవరాహిత్యంతో మంత్రులందరినీ తనవాళ్లుగా నమ్మడం వల్లే లీకులు వెళ్లే పరిస్థితులు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు.
జగన్ క్లాస్ తీసుకున్న మంత్రులు ఎవరు..
మంత్రివర్గభేటిలో జరిగిన చర్చ కూడా టీడీపీ అనుకూల మీడియాలో ఎలా వస్తుందనేది సీఎం జగన్ ప్రశ్న. మంత్రివర్గంలో జరిగిన సంభాషణ సైతం ఆయా టీడీపీ అనుకూల పేపర్లు, టీవీల్లో వచ్చేస్తున్నాయని ఉదాహరణలతో సహా జగన్ చూపించడం చర్చనీయాంశంగా మారింది. జగన్ నిఘా పెట్టి అనుమానిస్తున్న వారిలో ఇద్దరు మంత్రులు ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. వారిద్దరికీ జగన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. జగన్ ను వారు తక్కువ అంచనా వేస్తున్నారని పలు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై జగన్ మరింత నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. పరిస్థితులు చేజారకుండా జగన్ ఆ మంత్రులపై షాకింగ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చేనే వాదనలు లేకపోలేదు.
అనుభవలేమితోనే ఇలా జరుగుతోందా..
ప్రతిపక్ష టీడీపీకి కొన్ని మీడియా వర్గాలు అనుకూలమని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ నేపథ్యం తెలిసి కూడా మంత్రివర్గ విషయాలను ఎలా లీక్ చేస్తున్నారనేది వైసీపీ నాయకుల ప్రశ్న. సీఎంగా జగన్ తోపాటు కొందరు మంత్రి పదవులకు కూడా కొత్తే. మీడియా కదా.. ఎందుకొచ్చింది స్నేహంగా ఉంటే సరిపోతుంది కదా అనుకుని కొందరు ఆ వర్గం మీడియాకు లీకులు ఇచ్చుండొచ్చు. కానీ.. మంత్రివర్గం అన్నాక సీఎంకు అనుకూలంగనే ఉండాలి. ఇప్పటికే జగన్ ప్రభుత్వ అనుభవరాహిత్యాన్ని టీడీపీ సరిగ్గా వాడుకుని ఆడుకుంటోంది. జగన్ ప్రభుత్వ ప్రతి నిర్ణయాన్ని కోర్టుల్లో అడ్డుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ కు మంత్రివర్గ సహచరులు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.