ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్దికాలంగా ఇరుకున పడ్డ అంశాల్లో కరోనా మహమ్మారి ఏపీలో విస్తరించిన తీరు ఒకటి. వాస్తవంగా ప్రభుత్వం నిర్ణయం మేలు చేసేదే అయినప్పటికీ దాన్ని అన్వయించుకున్న తీరుతో సమస్యలు వచ్చాయని కొందరు చెప్తుంటారు.
కరోనా వైరస్ విషయంలో ముందుగా చేయాల్సింది. ఎవరికైతే ఈ వైరస్ సోకిందో వారిని గుర్తించి మిగతా వారి నుంచి వేరు చేసి, ట్రీట్మెంట్ చేయాలి, రోగ నివారణ చేయాలి. వీటన్నింటికీ మూలం కరోనా టెస్టులు చేయించుకోవడం. ఏపీ ప్రభుత్వం దీన్ని గుర్తించి పెద్ద ఎత్తున టెస్టులు చేయించింది. దీంతో సహజంగానే రోగ లక్షణాలు ఉన్న వారి సంఖ్య పెద్ద ఎత్తున నమోదు అయింది. అయితే, దానిపై విమర్శలు ఎదురయ్యాయి. అలాగే ఏపీ ప్రభుత్వం తీరును పలువురు అభినందించారు కూడా. కాగా, కరోనా విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒక్క రోజులో ఏపీలో ఏం జరుగుతోందంటే…
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి గురించి సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 70 వేల టెస్టులు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ బాగా తగ్గుమఖం పడుతోందని తెలిపారు. వారం క్రితం 5.5 ఉండే పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.76గా ఉందని అన్నారు. 104 కు డయల్ చేస్తే కచ్చితంగా అర్ధగంటలో బెడ్ అలాట్ చేసి, చికిత్స అందించాలని స్పష్టం చేశారు. కోవిడ్ కేర్ సెంటర్ ఆసుపత్రిలో జాగ్రతలు తీసుకోవాలని ఆయన అన్నారు.
కరోనా వచ్చి తగ్గిన వారి సంగతి ఏంటి?
కరోనా నుంచి కోలుకున్న వారి విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 10 శాతం కేసుల్లో కోవిడ్ వచ్చివెళ్లిన తర్వాత కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సర్వేలో తేలిందని సీఎం జగన్ అన్నారు. కోవిడ్ తగ్గాక కిడ్నీ సమస్యలు, హార్ట్, చెవుడు వంటి సమస్యలు కూడా వస్తున్నాయని ఆయన అన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత 6 నుంచి 8 వారాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని వారికి గుర్తు చేయాలని ఆయన అధికారులని ఆదేశించారు. ఇటువంటి కేసులను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకురావాలని హెల్త్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తున్నామని ఆయన అన్నారు. వైద్యులు సరిపడా ఉన్నారా… మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలని అయన ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ విషయంలో కీలక నిర్ణయం
ప్రతి ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో కూడా హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. రానున్న 15 రోజుల్లో ప్రతి ఆస్పత్రిలో ఉండాలని అన్నారు. హెల్త్ సెక్రటరీ దీన్ని మానిటరింగ్ చేయడంతో పాటు జాయింట్ కలెక్టర్ కూడా ధ్యాస పెట్టాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్యమిత్రకు సరైన ఓరియంటేషన్ ఉండాలి. శిక్షణ ఉండాలని ఆయన అన్నారు. 104 కాల్ సెంటర్పైనా మాస్క్లపైనా సోషల్ డిస్టెన్స్పైనా హేండ్ శానిటైజేషన్ పైనా అవగాహన చాలా అవసరమని జగన్ అన్నారు. వైద్యుల, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటడం వంటి నాలుగు అంశాలపై ఫీడ్ బ్యాక్ ఉండాలని సీఎం జగన్ కోరారు.