YS Jagan: కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఎప్పటిలా అన్ని రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఈసారి కేంద్రం తనకేమి కేటాయిస్తుందో ఆసక్తిగా వేచి చూస్తోంది. ముఖ్యంగా కొత్త రాష్ట్రంగా వేరు పడినప్పటి నుంచీ కేంద్రం వైపు ఏపీ ఆశగా ఎదురు చూడటమే జరుగుతోంది. ప్రధానంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు.. ఇలా చాలా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఓడిపోయింది. వాటిని తీర్చాల్సిన బాధ్యత 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీపై పడింది. ఇన్నేళ్లలో చాలా బడ్జెట్ లు ప్రవేశపెట్టారు కానీ.. ఏపీకి ఒరిగిందేమీ లేకపోయింది. నాలుగు బడ్జెట్ లు చూసి విసుగెత్తిపోయిన అప్పటి సీఎం చంద్రబాబు 2018లో కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెళ్లి 2019లో ఓడిపోయారు. ఇదంతా గతం..
ఏపీకి ఒరిగిందేమీ లేదు..
ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఏపీకి కేంద్రం అందించాల్సిన సాయం అందని ద్రాక్షగానే ఉంది. 2021 డిసెంబర్ కు పోలవరం పూర్తి చేస్తామన్న వైసీపీ చేయలేకపోయింది. ప్రత్యేక హోదా కాదు కదా.. స్పెషల్ ప్యాకేజీ ఊసు కూడా లేదు. రాజధాని అభివృద్ధీ లేదు. అన్ని రాష్ట్రాలకు ఎలా ఇస్తున్నారో.. ఏపీకి అలానే ఇస్తున్నారు కానీ.. ప్రత్యేక నిధులు లేవు. పోలవరం సవరించిన అంచనాకు దాదాపు 10వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా ససేమిరా అంటోంది. 16 మెడికల్ కాలేజీలకు 3200 కోట్లు, పోర్టులు, స్టీల్ ప్లాంట్.. ఇలా చాలా సాయం చేయాల్సి ఉంది. అన్నీ పెండింగులే. మరి.. సీఎం జగన్ ఏం చేయబోతున్నారు..?
జగన్ ఏం చేస్తారో..
టీడీపీ-బీజేపీ మిత్రబంధంగా ఉన్నా రాష్ట్రానికి ఒరిగింది లేదు. విసుగెత్తిన చంద్రబాబు కేంద్రానికి ఎదురెళ్లి ధర్మపోరాట దీక్షలు చేశారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించడంలో వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ సక్సెస్ అయ్యాయి. రాష్ట్రంలో వైసీపీ-బీజీపీ టామ్ అండ్ జెర్రీ వ్యవహారమే. రెండు పార్టీలకు పోత్తు లేకపోయినా అధిష్టానం సహకారం ఉందనేది ఓ వాదన. కేంద్రానికి ఎదురెళ్లి చంద్రబాబు మీదకు తెచ్చుకున్నట్టు కాకుండా వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్నాయి.. బడ్జెట్ లు పోతున్నాయి.. ఎన్నికలు వస్తున్నాయి. మరి.. చంద్రబాబు వైఫల్యాలను ఎత్తిచూపిన వైసీపీ ఇప్పుడు కేంద్రం నుంచి ఏమేరకు రాబడుతుందో చూడాల్సిందే..!