ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా.. 2017లో వైసీపీ అధ్యక్షుడి హోదాలో ‘నేను సీఎం అవ్వాలి.. 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ చేయాలి.. ప్రజల మనసుల్లో నిలిచి పోవాలి.. నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలి’ అన్నారు. ఆరోజు.. ఆమాటలు.. పార్టీ అధ్యక్షుడి హోదాలో సీఎం కావాలనే కుతూహలంతో జగన్ అన్నారులే.. అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా.. సొంత పార్టీ నేతలు.. ప్రజలు కూడా భావించి ఉండొచ్చు. కానీ.. ఆ మాటల్లోని అర్ధం ఇప్పుడు అందరికీ అర్ధమవుతూ ఉండొచ్చు. జగన్ కల సాకారం కావడానికి.. పునాది పడటానికి కేవలం రెండేళ్ల వ్యవధి.. సమయం మాత్రమే పట్టింది. 2019 ఎన్నికల్లో జగన్ తిరుగులేని మెజారిటీతో గెలిచి ఏపీ సీఎం అయ్యారు. అయితే.. 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవ చేయాలి అనే మాటను కూడా నిలబెట్టుకునేందుకు ఇప్పటినుంచే అడుగులు వేస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది.
జగన్ ఆలోచనకు ‘ఇళ్లే’ పునాది..
ఇందుకు మొదటి అడుగు.. జగనన్న కాలనీలనే చెప్పుకోవాలి. సీఎం జగన్ ప్రజలకు ఇస్తున్నది సెంటు భూమి.. అందులో ఇల్లు. నిజానికి.. ఈ స్థలంలో ఇల్లు చిన్నదే. కానీ.. ప్రజల్లో మాత్రం ప్రభుత్వం నుంచి ఇల్లు వచ్చింది.. సీఎంగా జగన్ ఇచ్చిన ఇల్లు అనే. పైగా.. రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వడం. ఇది ఏఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఇళ్లను నిర్మించే పనికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. భూసేకరణ, లేఅవుట్లు, కాలనీలు.. ఇలా జగనన్న ఇళ్ల పథకం ముందుకెళ్తోంది. చంద్రబాబు హయాంలో టిడ్కో ద్వారా కట్టిన ఇళ్లు పూర్తైనా లబ్దిదారులకు ఇవ్వలేదు. ఈలోపు ఎన్నికలు రావడం.. చంద్రబాబు ఓడిపోవడం జరిగిపోయింది. జగన్ ఆ తప్పు చేయడానికి సిద్ధంగా లేరు. సాధారణ ఎన్నికలకు మూడున్నరేళ్లు, జమిలి ఎన్నికలే అయితే.. ఏడాదిన్నర సమయం ఉంది. ఈమాత్రం సమయం చాలు.. ఒక ముఖ్యమంత్రికి తాను సంకల్పించిన పనులు చేయడానికి. జగన్ ప్రభుత్వం చేస్తోంది ఇదే.
ఇళ్లు కాదు.. ఊళ్లు..
‘30 లక్షల మంది పేదలకు సొంత ఇళ్లు..’ అనేది సామాన్యమైన విషయం కాదు. దేశవ్యాప్తంగా చర్చ జరిగిన అంశం ఇది. కోర్టు కేసుల్లో ఉన్న ప్రాంతాల్లో కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలిచ్చేశారు. ఇక మిగిలింది ఇళ్ళ నిర్మాణమే. అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. సీఎంగా జగన్ ఆరోజు చెప్పింది.. ‘మేం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు’ అని. ఈమాట ప్రజల్లోకి బాగా వెళ్లింది. కాలనీలుగా ఆయా ప్రాంతాల్లో జగన్ ప్రభుత్వం ఇళ్లు కడితే వేలు.. కొన్నిచోట్ల లక్షల్లో జనావాసాలుగా ఆ కాలనీలు మారిపోతాయి. పంచాయతీలు, స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు.. ఇలా గ్రామాలే ఏర్పడిపోతాయి. ఇవన్నీ గ్రాఫిక్స్ లా కాకుండా లేఅవుట్లు వేసేసి ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేయడంతో జగన్ ప్రభుత్వానికి ఇళ్లు కట్టి ఇచ్చేయడం నల్లేరు మీద నడకే. ఇదే జరిగితే రాష్ట్రంలో, ప్రజల్లో జగన్ తాను గతంలో అన్న మాట.. ‘30 ఏళ్లు సీఎంగా ఉండాలి’ అనే మాటకు ఈ ఇళ్లే పునాది కాబోతున్నాయని చెప్పాలి.
టీడీపీ, చంద్రబాబే అసలు టార్గెట్..
నిజానికి జగన్ కు సీఎంగా ఉండటం, ప్రజల హృదయాల్లో నిలిచిపోవడం అనే మాటలు పక్కనపెడితే.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి అధికారం అందకుండా చేయడమే అసలు లక్ష్యం. టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లో వైసీపీ జెండా ఎగిరేలా చేయడం ఇందులో ముఖ్య ఘట్టం. అందుకే కొన్ని టీడీపీ ప్రాబల్యం ఉన్న శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 100 నుంచి 140 ఎకరాల్లో వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే ఆ కాలనీలన్నీ జగన్ కాలనీలు అయిపోతాయి. టీడీపీ నేతలు వెళ్లినా జగన్ ప్రాంతంలోకి వెళ్లినట్టే. కాస్త ఆలోచిస్తే టీడీపీకి అక్కడ ఓట్లు కష్టమే అవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీకి ఎక్కువ పడతాయి. దీంతో టీడీపీ ఆధిక్యం తగ్గించొచ్చు. పైగా.. త్వరలో కొత్త జిల్లాలు రాబోతున్నాయి. ఈ లెక్క కూడా వైసీపీకి కలిసొచ్చేదే. మరి.. జగన్ తలపెట్టిన జగనన్న కాలనీలు ఈ అంచనాలను ఏమేర నిజం చేస్తాయో చూడాల్సిందే.