‘గంటా శ్రీనివాసరావు’.. రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. మంత్రిగా అధికారం అనుభవించిన గంటా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఇమడలేక, అధికార పార్టీలోకి వెళ్లలేక తడబడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సీఎంలుగా ఉన్న సమయంలో గంటా మంత్రిగా నెంబర్ టుగా పెత్తనం చెలాయించేవారు. విశాఖ టూర్ కు హెలికాఫ్టర్ లో వెళ్లే సీఎం పక్కనే గంటా.. కాన్వాయ్ అయినా కూడా సీఎంతో పాటే. అదీ గంటా రేంజ్. ఆస్థాయి నాయకుడి ప్రస్తుత పరిస్థితి అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని రాజకీయ జీవితం ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది. గతంలో ఆయన ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. త్వరలో మరిన్ని షాకులు ఇవ్వనుందని కూడా తెలుస్తోంది.
గంటా ఆక్రమణలకు రెవన్యూ శాఖ చెక్..
విశాఖ రూరల్ మండలం అడవివరం గ్రామంలో ఆయన భార్య, అనుచరుల పేరుతో ఉన్న ప్రభుత్వ భూమిని ఇటివల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీంతోపాటు విశాఖ చుట్టుపక్కన గంటాతోపాటు ఆయన అనుచరులు కూడా మరికొన్ని భూములు ఆక్రమించారని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దీనిపై జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు. ఇప్పటికే ప్రాధమిక ఆధారాలు సేకరించి.. దాదాపు 50 ఎకరాల వరకూ స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత రానుంది.
గేట్లు మూసుకుపోవడంతో పాటు.. రాజకీయ జీవితం మూడినట్టే..
నిజానికి గంటాకు పరిస్థితులు అనుకూలించి ఉంటే ఆయన వైసీపీలోకి వెళ్లి ఏడాది పూర్తయ్యేది. కానీ.. స్థానిక నాయకత్వంతోపాటు విజయసాయిరెడ్డికి, మంత్రి అవంతితో గంటాతో సరిపడట్లేదు. దీంతో ఆయన రాకను అన్నిరకాలుగా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఈ భూవివాదాలతో ఆయనకు వైసీపీ ఎంట్రీ దాదాపు అసాధ్యమనే తెలుస్తోంది. ఆయన అనుచరుల ఆక్రమణలను కూడా వెలికీతీసి ఒకొక్కరిగా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈక్రమంలో గంటాపై కూడా కేసులు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. ఈనేపథ్యంలో టీడీపీలో కూడా ఆయన ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనపడటం లేదు.