వేల కోట్లతో సంక్షేమ పథకాలు.. పేద, మధ్యతరగతి వారికి జేబు నిండా డబ్బులు, ప్రభుత్వ కార్యాలయాకు రంగులు, కార్యకర్తల ఇళ్లపై జెండాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటోలు.. ఇవన్నీ వైసీపీకి ఓట్లు తెచ్చిపెడతాయా..? 30 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా జగన్ ఉండేందుకు ఉపయోగపడతాయా? జగన్ వేస్తున్న తప్పటడుగులను ఎప్పుడు సరిదిద్దుకుంటారు? సమస్యలను పరిష్కరించేది ఎప్పుడు? జగన్ ను జనం గుండెల్లో పెట్టుకోవాలంటే చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైంది ఇసుక. ఈ సమస్యను జగన్ పరిష్కరిస్తే జగన్ 30 ఏళ్లపాటు సీఎం కల నెరవేరినట్టే.
ఈ ఒక్క సమస్య తీరిస్తే చేరువైనట్టే..
ఏపీలో ఇసుక వనరులకు కొదవ లేదు. ప్రతి జిల్లాలోనూ ఇసుక లభ్యత ఉంది. కానీ.. పేద, మధ్యతరగతి వారు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక సమస్య. బ్లాక్ మార్కెట్ లో కొనాల్సిందే. కళ్ల ఎదుట ఉన్న ఇసుక అక్రమంగా తరలిపోతున్నా తాము మాత్రం వేలు పోసి ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇది ఎప్పటినుంచో ఉన్న సమస్య. ఈ ఒక్క సమస్య తీరిస్తే జగన్ ప్రజల గుండెల్లో నిలిచిపోయినట్టే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రయత్నించి విఫలమయ్యారు. సీఎంగా జగన్ వచ్చిన తర్వాత కూడా మరోరకంగా చేయబోయి విఫలమవుతున్నారు. పైగా.. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక అక్రమాల్లో వాటాలు తీసుకోవడం జగన్ ప్రభుత్వానికి మచ్చ తెస్తోంది.
ఇసుక అవినీతి అరికట్టడం సవాలే..
క్షేత్రస్థాయిలో అవినీతి ఎక్కువగా జరిగేవాటిలో ఇసుక మొదటి స్థానంలో ఉంటుంది. ఇసుక అవినీతి చేసేవారికి పార్టీలతో సంబంధం లేదు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తూ తమ పని కానిచ్చేస్తూంటారు. టీడీపీ ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చినా ఫెయిల్ అయింది. కాంట్రాక్టర్లకు, అక్రమార్కులకు మాత్రమే ఇసుక ఉచితంగా దక్కింది. జగన్ సీఎం అయ్యాక కొత్త విధానం తీసుకొచ్చారు. అయినా.. ఇసుక అక్రమార్కులకే వెళ్లిపోతోంది తప్ప పేద, మధ్యతరగతి వారికి అందడం లేదు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసినట్టే వైసీపీ నాయకులు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇసుక అక్రమాల మూలాల్లోకి వెళ్లి అరికడితే ప్రజల్లో సుస్థిర స్థానం ఖాయం.