రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం రావణకాష్టంలా రగులుతోంది. రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమే ఏపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే.. వెనువెంటనే విజయవాడలో సీతమ్మ విగ్రహ ధ్వంసం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పడింది. వైసీపీ, టీడీపీ ఒకరికొకరు ప్రత్యారోపణలు, రామతీర్ధంకు నేతల పర్యటనలతో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తన 19 నెలల పాలనలో అత్యంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు సీఎం జగన్. అంతర్వేది రధం దగ్దం, కర్నూలు జిల్లాలో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం.. ఇప్పుడు వరుస ఘటనలతో రాష్ట్రంలో ఒక్కసారిగా ‘మతం’ అంశం వెలుగులోకి వచ్చింది. ఓవైపు ఇంత అల్లకల్లోల పరిస్థితులు జరుగుతుంటే రీసెంట్ గా ప్రకాశం జిల్లాలో లక్ష్మీనరసింహా ఆలయంలో విగ్రహాల ధ్వంసం జరగడం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెంచేస్తోంది.
వరుస ఘటనలు ప్రభుత్వానికి మచ్చేనా..?
అంతర్వేది, కర్నూలు ఘటనలపై ఆందోళనలు జరిగినా సద్దుమణిగాయి. కానీ.. ప్రస్తుతం జరుగుతున్న వరుస దాడులపై విమర్శలు, ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా లేవు. పైగా శాంతిభద్రతల అంశం, ప్రభుత్వ వైఫల్యం, హిందువుల మనోభావాలు.. ఇలా ప్రతి అంశం రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలను బీజేపీ అగ్ర నాయకత్వం సునిశితంగా పరిశీలిస్తోందని సమాచారం. హిందూత్వం ప్రధానాస్త్రంగా తీసుకునే ఆరెస్సెస్ సైతం ఏపీలో జరుగుతున్న దాడులను పరిశీలిస్తోందని సమాచారం. సునీల్ ధియోదర్ చేస్తున్న వ్యాఖ్యలే కానీ.. త్రిదండి చినజియర్ స్వామి ఏపీ పర్యటన ప్రకటన కానీ తీసుకుంటే ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందనే చెప్పాలి. పైగా ఇన్ని దాడులు జరుగుతున్నా నిందితులను పట్టుకోలేక పోవడం ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాలి.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు..
జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీనే ఈ పనులు చేయిస్తోందని వైసీపీ, జగన్ ఈ పనులు చేయిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి, చంద్రబాబు పర్యటనలు మరింత హీటెక్కించాయి. అయితే.. ఇదే ప్రాంతానికి నిన్న బీజేపీ-జనసేన పార్టీలు వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. నేతలను అరెస్టు చేశారు. దీంతో ఇప్పుడు పూర్తిగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీని అనుమతిచ్చి తమనెందుకు అనుమతించరు అనేది ఈ రెండు పార్టీల వాదన. మొత్తానికి హిందూ విగ్రహాల ధ్వంసం అంశం రావణకాష్టానికి మించి రగులుతోంది. పైగా.. పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన రాష్ట్ర బీజేప అధ్యక్షుడు సోము వీర్రాజు కింద పడిపోవడం, బీజేపీ – జనసేన పార్టీ నేతల అరెస్టులను కేంద్రం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఒత్తిడిలో ప్రభుత్వం..!
దీంతో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి తీవ్ర ఒత్తిడికి లోనై టీడీపీ నాయకుడు అశోక్ గజపతిరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి. గుడివాడలో మంత్రి కొడాలి నాని అనుచరుల పేకాట క్లబ్బుల వ్యవహారం మరో కోణం. మొత్తంగా ప్రభుత్వం ఈ అనుకోని విపరీత ధోరణులతో ఇరుకున పడినట్టైంది. మరోవైపు హిందూత్వమే ప్రధాన ఆయుధంగా చేసుకునే బీజేపీ తిరుపతి ఉపఎన్నికపై తన మార్కు రాజకీయం మొదలెట్టేసింది. భగవద్గీత పట్టుకునే వాళ్లకు కాకుండా.. బైబిల్ పట్టుకునే వారికి ఓటేస్తారా అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్ నుంచి రిపోర్టు తెప్పించుకునే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తోంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ నిఘా పెట్టే అవకాశం ఉందా..? అంటే లేదనే చెప్పాలి.
కేంద్రం అంత రిస్క్ చేస్తుందా..?
కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు, ఏపీలో సీఎం జగన్ కు మధ్య ప్రస్తుతం సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని విషయంలో కూడా జగన్ నిర్ణయాలను తప్పుపట్టిన దాఖలాలు లేవు. వీరిద్దరి కామన్ శత్రువుగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వైసీపీ మద్దతివ్వడం, వరుసగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీలు వీరి స్నేహానికి నిదర్శనం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై పెద్దగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయకపోవచ్చు. తమ నాయకులను వారించకుండా.. వైసీపీని విమర్శించకుండా జాగ్రత్తగా విషయాన్ని హ్యాండిల్ చేయోచ్చు. టీడీపీకి అవకాశం ఇవ్వకూడదంటే బీజేపీ–వైసీపీ తమ మైత్రిని కొనసాగించాల్సి ఉంది. మరి ఈ అంశం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?