ఇన్నాళ్ల తర్వాత తెరపైకి వచ్చిన “ఓటుకి నోటు” కేసు వలన ఎవరికి ముప్పు..!? అందరూ అనుకునేది చంద్రబాబుకి అని మాత్రమే. కానీ ఈ విషయంలో సీఎం జగన్ తనకు తెలియాకుండానే హై రిస్క్ లోకి వెళ్ళిపోయినట్టు. ఆ కేసు ఎంత బలపడితే సీఎం జగన్ అంత బలహీనపడినట్టు. అవును ఆశ్చర్యంగా ఉన్నా.., అదే అసలు లెక్క. అదే బీజేపీ వేసిన పెద్ద బోను. దీనిలో చిక్కుకునేది జగనూ, చంద్రబాబు ఇద్దరూనూ..!!
తెలంగాణాలో ఏం జరిగింది..!?
తెలంగాణ రాజకీయాలను ఓ సారి చూద్దాం. అక్కడ కేసీఆర్ తనకు ప్రత్యర్ధులు ఉండకూడదు.. ఉండకూడదు అనుకుని ఏకపక్ష రాజకీయాలు చేసారు. టీడీపీని చంపేశారు. కాంగ్రెస్ ని ఐసీయూలోకి పంపించారు. ఫలితంగా ఏమైంది..? టీడీపీ, కాంగ్రెస్ ల స్థానంలో బీజేపీ వచ్చి కూర్చుంది. ఆ రెండు పార్టీల కంటే బీజేపీ మహా డేంజర్ ప్రత్యర్థి. కేసీఆర్ తనకు ప్రత్యర్ధులు ఉండకూడదు అనే ఆశకు పోయి.. తన ప్రత్యర్థులకు బీజేపీని దారిగా చూపించారు. ఆ దారిని బీజేపీ బాగా వాడుకుంది. ఇప్పుడు మేకై కూర్చుంది. దుబ్బాక, గ్రేటర్.. ఇక 2023 బాటలు బీజేపీకి సులువయ్యాయి. సో.., అక్కడ బీజేపీ లేవడంతో ఆ పార్టీ పాత్ర కంటే టీఆరెస్ సొంత తప్పిదాలు, కేసీఆర్ అతి స్వార్ధం ఉన్నాయి.
ఏపీలో జగన్ కూడా అదే..!!
ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. సీఎం జగన్ ఇక్కడ టీడీపీని చంపేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. రేపో, మాపో ఆ పార్టీ ఐసీయూలోకి వెళ్ళిపోతుంది. అంటే ఏపీలో జగన్ కి రాజకీయంగా తిరుగు ఉండదు అనుకుంటే పొరపాటే. టీడీపీ స్థానంలోకి బీజేపీ వస్తుంది. జగన్ ప్రత్యర్థులకు బీజేపీ వేదికగా మారుతుంది. సేమ్ తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా బీజేపీ జగన్ పై మేకై కూర్చుంటుంది. బీజేపీ కోరుకుంటున్నది అదే. జగన్ కి బీజేపీతో శత్రుత్వం కంటే.., చంద్రబాబుతో శత్రుత్వమే మేలు. బీజేపీ చేతుల్లోకి ఒకసారి రాష్ట్రం వెళ్తే మళ్ళీ జగన్ చేతికి రావడం కష్టం. అదే చంద్రబాబు చేతికి వెళ్తే అతని తప్పులతో తిరిగి జగన్ కి అవకాశాలు వస్తాయి..!! సో.., తనకు తెలియకుండా బీజేపీతో కలిసి చంద్రబాబుని, టీడీపీని పతనం చేస్తే నష్టం జగన్ కి కూడా గట్టిగానే ఉంటుంది. అందుకు ఉదాహరణ బీహార్, తెలంగాణలు చూడవచ్చు..!!
బీజేపీ ఒకే కేసుతో రెండు దెబ్బలు..!!
ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓటుకి నోటు కేసు తెరపైకి వచ్చింది అంటే ఇదేమీ ఆషామాషీ అంశం కాదు. నిన్న తెలంగాణాలో ఉదయ సింహ అనే వ్యక్తి అరెస్టు. ఈరోజు సుప్రీం లో ఆ కేసు కదలికలు. ఇవన్నీ చంద్రబాబుకి రెడ్ సిగ్నల్స్ పంపిస్తున్నాయి. అక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ పగ్గాలు రేవంత్ కి ఇస్తే.. ఇదే కేసుతో అక్కడ రేవంత్ ని, ఇక్కడ చంద్రబాబుని ఇరికించే ప్లాన్ బీజేపీ దగ్గర ఉండొచ్చు. అయితే ఈ కేసులో చంద్రబాబుని ఇరికిస్తే, మూసేస్తే ఆ ఊపుతో జగన్ ఇక్కడ టీడీపీని మూసేసే పనిలో ఉంటారు. అంటే జగన్ కోరుకున్నట్టు టీడీపీ పతనం అవుతుంది. కానీ.. అక్కడే అసలైన రాజకీయం మొదలవుతుంది. జగన్ కి అసలైన శత్రువుగా బీజేపీ మారుతుంది. చచ్చిన కాంగ్రెస్, ఐసీయూలో ఉన్న టీడీపీలో బలమైన వారిని తెచ్చుకుని, కమల పూల సేద్యం మొదలు పెడుతుంది. అది జగన్ కి రిస్క్. అందుకే దీనిపై ఆలోచించుకోవాల్సింది, అప్రమత్తంగా ఉండాల్సిందే ఏపీ సీఎం జగన్ మాత్రమే..!!