ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరి ఏంటి? ఆయన వ్యతిరేకమా.. అనుకూలమా అనే విషయాలు కొన్నాళ్లుగా చర్చల్లో నిలుస్తున్నాయి. ఇందులో అందరూ ఏకపక్షంగా చెప్పే మాట ఆయన అమరావతికి వ్యతిరేకమనే. అయితే.. అమరావతిలో ఇప్పటివరకూ నిర్మితమైన కట్టడాలను జగన్ కొనసాగిస్తారా.. లేదా అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. కానీ.. అమరావతిపై సీఎం జగన్ సమీక్ష చేయడం చర్చనీయాంశమైంది. అమరావతిలో కొనసాగుతున్న కట్డడాలను ఆపమని నిధులు సమీకరించుకుని నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఉంది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని జగన్ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ గతంలో ఉన్న నిర్మాణాలను నిలిపేసే ప్రసక్తి లేదని అంటున్నారు. ఏపీ రాజధానిపై స్పష్టత తీసుకున్న సీఎం ఇప్పుడు అమరావతిపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఆర్దిక శాఖతో సమన్వయం చేసుకుని కట్డడాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పలు భవనాలను పరిశీలించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టట్లేదనే సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్.
హ్యాపీ నెస్ట్ ను కొనసాగించండి: సీఎం జగన్
అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్’. సీఆర్డీలే చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఫ్లాట్స్ బుకింగ్ అనౌన్స్ చేసిన తొలి రోజే ఫ్లాట్స్ బుకింగ్ పూర్తైపోవడం అప్పటి ప్రభుత్వాన్నే ఆశ్చర్యపరచింది. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు.. ముఖ్యంగా ఎన్నారైలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపడంతో ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టు సంచలనం సృష్టించింది. రెండో విడత ఫ్లాట్స్ బుకింగ్స్ కు కూడా సీఆర్డీఏ అప్పట్లో ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కొందరు తమ డబ్బులు తిరిగి చెల్లించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. ‘హ్యాపీనెస్ట్’ ను కొనసాగించాలని సీఎం జగన్ ఇప్పుడు ఆదేశాలివ్వడంతో ప్రాజెక్టులో కదలిక రానుంది. ఫ్లాట్లు కొన్నవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.