“మోడీ గారూ నమస్తే..! రాష్ట్ర విభజన తర్వాత కష్టాలు మీకు తెలుసు. మీరే సాక్షి. విభజన నేపథ్యంలో మాకిచ్చిన హామీల్లో “పోలవరం” కీలకంగా ఉంది. ఆ ప్రాజెక్టుని 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నాం. మీరే ఇవ్వాలి, మొత్తం ఇచ్చేయాలి” అంటూ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాసారు. అత్యవసరంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లు అవసరమని, ఆ మేరకు రుణం సేకరించేలా నాబార్డును ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.3,805.62 కోట్లను త్వరగా రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు ఈ విధానాన్ని సరళీకృతం చేయాలని కోరారు.
ఆయువు పట్టు వదిలేస్తే ఎలా…!!
జగన్ మూడు రాజధానులు అంటే అనవచ్చు గాక.., ఇళ్ల పట్టాలు పంపిణీ అంటే అనవచ్చు గాక.., కానీ జగన్ ఓ కన్ను మొత్తం పోలవరంపైనే ఉంది. 2023 నాటికి అది పూర్తి చేసి నీటిని ఇవ్వకపోతే జగన్ కి ఆరు జిల్లాలో చుక్కలు ఖాయం. శ్రీకాకుళం మొదలుకుని గుంటూరు వరకు ఆ ప్రభావం ఉంటుంది. అందులోకి ఏమాటకామాటే చెప్పుకోవాలంటే చంద్రబాబు హయాంలో పోలవరం పనులు బాగానే జరిగాయి. జగన్ వచ్చాక నెమ్మదించాయి అనేది వారికి కూడా తెలుసు. అందుకే ఈ మచ్చ లేకుండా నిధుల కోసం జగన్ వేట ప్రారంభించారు. అది జగన్ కి ఒకరకమైన ఆయువు పట్టు, దాన్ని వదిలేస్తే చిక్కులే కదా.., అందుకే అర్జంటుగా ఈ లేఖ మోడీకి చేరింది.
లేఖలో ఇంకా ఏం రాశారంటే..!!
విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి శరవేగంగా పూర్తి చేస్తామని కేంద్రమే హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా పీపీఏను ఏర్పాటు చేసింది. ప్రాజెక్టు పనులు 33.23 శాతం పూర్తయ్యాయి. హెడ్ వర్క్స్లో సివిల్ పనులు 71 శాతం, కుడికాలువ పనులు 92 శాతం, ఎడమ కాలువ పనులు 52 శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు 19 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నాం. ఆలోగా నిర్వాసితులందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్లో కాఫర్ డ్యామ్ల ఖాళీను భర్తీ చేసి ప్రధాన జలాశయం పనులు ప్రారంభిస్తాం. గడువులోగా పనులు పూర్తి చేయడం, నిర్వాసితులకు ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సకాలంలో నిధులు అందుబాటులో ఉండాలి.
మీరు అడిగినవన్నీ ఇచ్చేశాం…!!
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్ చేసింది. రూ.3,805.62 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. కేంద్రం విధించిన షరతుల మేరకు ప్రాజెక్టుకు చేసిన వ్యయంపై ‘కాగ్’ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ద్వారా ఆడిట్ చేయించిన స్టేట్మెంట్, సవరించిన అంచనా వ్యయాలను అందజేశాం. కానీ తిరిగి ఇవ్వడంలో ఆరు నుంచి 12 నెలల వరకు తీవ్ర జాప్యం జరుగుతోంది. రీయింబర్స్ చేయడానికి రుణం సేకరించాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశిస్తుంది. నాబార్డు సేకరించిన రుణాన్ని ఎన్డబ్ల్యూడీఏకు పంపుతుంది. ఎన్డబ్ల్యూడీఏ ఆ నిధులను పీపీఏకు పంపుతుంది. పీపీఏ చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ క్లిష్టతరమైన విధానం వల్ల రీయింబర్స్మెంట్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. దీన్ని సరళీకృతం చేయడం ద్వారా గడువులోగా పూర్తి చేయగలం అంటూ వేడుకున్నారు.
2021 మార్చిదాకా రూ.15 వేల కోట్లు అవసరం.
హెడ్వర్క్స్ పూర్తి చేయడానికి రూ.ఐదు వేల కోట్లు, కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయడానికి మరో రూ.ఐదువేల కోట్లు అవసరం. అక్టోబర్లోగా (ప్రస్తుతం 20,870 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస కల్పన కోసం పూర్తిచేసిన 26 కాలనీలు కాకుండా) 41.15 మీటర్ల కాంటూర్ వరకూ పునరావాస కల్పన, భూసేకరణకు రూ.ఐదు వేల కోట్లు అవసరం. ఈ నిర్వాసిత కుటుంబాలను వచ్చే ఏడాది మార్చిలోగా పునరావాస కాలనీలకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రైతులకు పోలవరం ప్రాజెక్టు ఫలాలను అందించడానికి కేంద్రం సహకరించాలి. అంటూ జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు. మరి కేంద్రం స్పందన ఎలా ఉంటుంది..? జగన్ విజ్ఞప్తుల్ని ఏ మేరకు వింటుంది అనేది చూడాలి.