CM Jagan: ఏపీలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి త్వరలో మూడేళ్లు పూర్తి కాబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఆయన సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ‘నవ రత్నాలు’ పేరుతో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. జగన్ సీఎం కావడం వాటిని అమలు చేయడం చకచకా జరిగిపోయాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చామని సీఎంతో సహా వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఆ పధకాల అమలుకు నిధుల లేమి సమస్య వస్తోందనే వార్తలు వస్తున్నాయి.
పధకాలు వాయిదా..!
కరోనా పరిస్థితుల మధ్య ఈ రెండున్నరేళ్లలో జగన్ సంక్షేమ పథకాల అమలు చేస్తూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తోందనేది నిజం. రాబడి తగ్గింది.. ఖర్చులు పెరిగిపోయాయి. మళ్లీ కొత్త ఏడాది వచ్చింది. దీంతో పధకాలు యధావిధిగా అమలు చేయాల్సి ఉంది. కానీ.. నిధుల లేమితో ఇప్పుడు ప్రభుత్వం పధకాల అమలుకు నిధుల వేటలో పడిందని తెలుస్తోంది. ప్రతి ఏటా జనవరి నెలలో ఇస్తున్న అమ్మఒడి పధకం జూన్ కు వాయిదా వేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదే నెలలో ఇవ్వాల్సి ఈబీసీ నేస్తం పధకం కూడా వాయిదా పడింది. 650 కోట్ల ఖర్చయ్యే ఈ పధకాన్ని కర్నూలు జిల్లాలో సీఎం (CM Jagan) ప్రారంభించాల్సి ఉన్నా వాయిదా పడిందని తెలుస్తోంది.
సీఎం ధృడ సంకల్పం..
ఉద్యోగులకు పీఆర్సీతో 10వేల కోట్ల అదనపు భారం కూడా ప్రభుత్వంపై పడనుంది. అయితే.. సంక్షేమ పధకాల అమలును (CM Jagan) సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు పధకాల అమలు ద్వారా వారి మెప్పు పొందామని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే అభిమానం ఓట్లు పడేలా చేస్తాయనేది వైసీపీ నాయకుల ఆలోచన కూడా. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో పధకాల వాయిదా వేసినా.. వాటిని అమలు చేయాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.