ఒక రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు.., కానీ అది జగన్ చేసారు..!! పార్టీని నడిపించడం అధికారంలో ఉన్నప్పుడు వేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరు..! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుల్లో భయం ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు అహం ఉంటుంది. ఈ భయాన్ని, అహాన్ని పోగొట్టి బ్యాలన్సు చేయడమే ఆ పార్టీ అధినేత పని..!! కానీ ఏపీలో పార్టీ అధ్యక్షుడే సీఎం అయిన కారణంగా ఇటు, అటు రెండు బ్యాలన్సు చేయడం కుదరడం లేదు. అందుకే వైసీపీ ఇప్పుడు కట్టు తప్పుతుంది. ఎక్కడికక్కడ వివాదాలు, విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికి చిన్నవే., కానీ వదిలేస్తే మాత్రం పెద్దవై ఊహించని నష్టం చేసేస్తాయి. అందుకే జగన్ తనకున్న అన్ని పనులు వదిలేసి ఓ వారం పార్టీ పని మీద ఉండాల్సిందే.
ఏడాదిన్నరలో ఏమైనా చూసారా..!?
జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి ఏడాదిన్నర గడుస్తుంది. ఈ కాలంలో ఆయన పార్టీపై పెద్దగా దృష్టి పెట్టింది ఏమి లేదు. కనీసం సగానికి పైగా ఎమ్మెల్యేలకు జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. కేవలం ద్వతీయ శ్రేణిలో ఉన్న అయిదుగురు నేతలను జిల్లాల ఇంచార్జిలుగా పెట్టి పార్టీ వ్యవహారాలను చూడమని చెప్పారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి తదితరులు పార్టీ వ్యవహారాలను చేస్తున్నప్పటికీ ఒక స్థాయికి పరిమితం అవుతున్నారు. మరి జిల్లాల్లో ముదురున్న గొడవలను సరిదిద్దేది ఎవరు..? నియోజకవర్గాల్లో పెరుగుతున్న వివాదాలను సరి చేసేది ఎవరు..? ఈ ఏడాదిన్నరలో జగన్ ఏమి చూడలేదు. ఇది పెద్దగా నష్టం కాదు. పార్టీకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇవి కలుపు మొక్కలు దశలో ఉన్నాయి, ఈ మొక్కలను పీకాల్సింది జగన్ మాత్రమే. లేకపోతే మొనుగా, చెట్టుగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు.
దర్శి, గన్నవరం, చీరాల, ఒకటేమిటి..!?
రాష్ట్రంలో వైసిపి బలంగా ఉంది. పార్టీకి తిరుగులేదు. కానీ నియోజకవర్గాల్లో నాయకత్వం మధ్య మాత్రం తిరుగుబాట్లు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, కీలక నాయకులు మధ్య అగాధం పెరుగుతుంది. ఎవరి వర్గాలను వారు పెంచి పోషించుకుంటూ సొంత వ్యవహారాలు చూసుకుంటున్నారు. గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ పార్టీలో చేరిన తర్వాత అక్కడ దిగువ స్థాయిలో వైసిపి శ్రేణుల్లో కొత్త భయం వచ్చేసింది. స్వేచ్ఛ కొరవడింది. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం వైసిపికి జై కొట్టిన తర్వాత అక్కడ కూడా మొదటి నుండి వైసిపిలో ఉన్న శ్రేణులకు అసంతృప్తి పెరిగింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కొట్టుకుంటున్నారు. దర్శిలో నిన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు.
గూడూరులో ఎమ్మెల్యే ఇంటి వద్ద పార్టీ శ్రేణులు ధర్నా చేసారు. గుంటూరు జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఇలా ఒక్కో జిల్లాలో ఒక్కో తరహా కొత్త ఇబ్బందులతో పార్టీ పరువు ప్రస్తుతం బయటకు వచ్చేసింది. అధికారం ఇస్తే ఇదా చేసేది..? అంటూ సాధారణ జనం చర్చించుకోనంత వరకు జగన్ కి వచ్చిన నష్టమేమి లేదు. అలా చర్చ రాకుండా ఉండాలి అంటే జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి, పార్టీని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. గడిచిన ఏడాదిన్నరలో సీఎం జగన్ ఒక్కసారి కూడా పార్టీపై దృష్టి పెట్టలేదు, సమీక్ష లేదు. కానీ పార్టీ కోసం చాలా అనవసర కథలను నడిపించారు. ఓ వారం రోజులు పాటూ సీఎం బాధ్యతలను కాస్త తగ్గించుకుని.. రోజుకి రెండు, మూడు గంటలు పార్టీ కోసం పెడితే రోజుకి ఒక జిల్లా సమీక్ష ఈజీగా పూర్తవుతుంది..!!