ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల తర్వాత దాదాపుగా తెరమరుగైపోయిన ‘ఏపీకి ప్రత్యేక హోదా’ అంశాన్ని సీఎం జగన్ మళ్లీ తట్టి లేపే ప్రయత్నం చేశారు. ఆగష్టు 15 వేడుకల్లో తన ప్రసంగంలో.. ‘పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని కోరుతూనే ఉంటాం. కేంద్రం మిగతా పార్టీలపై ఆధారపడే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు హోదా వచ్చే అవకాశం లేదు. అయినా.. హోదాను సాధించే ధృడ సంకల్పంతో ముందుకెళ్తాం. భవిష్యత్తులో అయినా.. కేంద్రం మనసు మారి హోదా ఇస్తుందనే నమ్మకంతో డిమాండ్ చేస్తూనే ఉంటాం’ అని వ్యాఖ్యానించారు.
నిజానికి.. దీనిపై ఈసరికే బీజేపీ నాయకులు ఎదురుదాడి చేస్తారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం సైలెంట్ గా ఉన్నారు. అయితే.. పార్టీ సీనియర్ నేత విష్ణువర్దన్రెడ్డి మాత్రం ‘ఇలాంటి అబద్ధపు మాటలు, హామీలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తార’ని ప్రశ్నించారు. దీంతో.. విష్ణు బీజేపీ పరువు కాపాడారంటూ పార్టీలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామమందిరం శంకుస్థాపన ఎస్వీబీసీలో లైవ్ రానప్పుడూ మొదటగా గళం వినిపించింది విష్ణు మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై మాట్లాడితే.. జీవీఎల్, కన్నా, పురంధేశ్వరి, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సుజనా.. ఇలా తెర ముందుకు వచ్చేవారు. కానీ.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై.. ముఖ్యంగా సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్లడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీజేపీని కరోనాతో పోల్చిన మంత్రి కొడాలి వ్యాఖ్యలపై కూడా కౌంటర్ వేయలేదు. అంటే.. వైసీపీ-బీజేపీ రాజకీయంగా కలసి వెళ్తున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. అధికారంలో ఉన్నందును ప్రత్యేక హోదాపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన రాజీనామాల పర్వం ఇప్పుడు ఉండకపోవచ్చు. ఏపీ విషయంలో రాజకీయంగా బీజేపీ వస్తే.. తాము ప్రత్యేక హోదాపై మాట్లాడతామని సీఎం జగన్ సంకేతాలిచ్చారా అనే వాదనలూ వినిపిస్తున్నాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలనే ఇలా జగన్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.