YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఫలితాలలో వైసిపి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమలో అదేరీతిలో ఉత్తర, దక్షిణ కోస్తా లో కూడా వైసీపీకి భారీగా ప్రజలు పట్టం కట్టారు. టోటల్ గా చూసుకుంటే ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికలలో.. జగన్ పార్టీ కి ప్రజలు మరోసారి పట్టం కట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అదే రీతిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు స్వగ్రామం నిమ్మకూరు లో కూడా వైసీపీ గెలవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
పరిషత్ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు ప్రచారంలో పాల్గొన్న గాని తెలుగుదేశం పార్టీ పెద్దగా ఫలితాలు రాబట్ట లేదు. మరోపక్క జగన్ ఎటువంటి మీడియా సమావేశం కూడా నిర్వహించకుండా.. కనీసం ప్రజలకు తమ పార్టీకి ఓటు వేయాలని ఒక ప్రకటన చేయకపోయినా గాని ప్రజలు.. వైసిపికి పట్టం కట్టడం పట్ల.. వైసిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పరిషత్ ఎన్నికల ఫలితాలపై సిఎం జగన్ స్పందించారు. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి అఖండ విజయం సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు.
ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలు రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పట్ల, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని పేర్కొన్నారు. సోమవారం ఉదయం కల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ పూర్తి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ వెల్లడించారు. పూర్తి ఫలితాలు వచ్చాక మరోసారి అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.