జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ సంక్షేమ పథకాలని, సమీక్షలంటూ గడిపేశారు. నియోజకవర్గాల్లో సమస్యలు తిష్ట వేశాయి. నాయకుల మధ్య సమన్వయం లేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో సోషల్ మీడియాలో వనుకబడి ఉంది. కొన్ని చోట్ల వర్గాలు తయారై పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఇదే క్రమంలో చాలా మంది నాయకులు నామినేటెడ్ పోస్టులు దక్కలేదని అలకపాన్పు మీద కూర్చున్నారు. వీటిపై దృష్టిపెట్టాల్సిన సమయం వచ్చిందని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాలు, సోషల్ మీడియావారీగా సమీక్షించి ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ఆ జిల్లా నుంచి మొదలు..
ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి సీఎం జగన్ ఆ అంశాలపై దృష్టి సారించనున్నారు. ప్రస్తుత రాజకీయాలపై ఫోకస్ పెట్టిన సీఎం ప్రతి నియోజకవర్గం లో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో కష్టపడిన పార్టీ కార్యకర్తలకే మెుదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ కొండపి, చీరాల, పర్చూరు నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీంతోపాటు సోషల్ మీడియా కార్యకర్తలపై కూడా ఆయన ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ప్రతి జిల్లాలో సోషల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సీఎం జగన్ న్యాయం చేయనున్నట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియాను ఇప్పటినుంచే తెరపైకి..
సోషల్ మీడియా కార్యకర్తలను కూడా పార్టీలో యాక్టివ్ చేసేందుకు సీఎం ఆలోచిస్తున్నారట. 2014లో ఓడిపోయినప్పటి నుంచీ 2019లో అధికారంలోకి వచ్చే వరకూ వైసీపీ సోషల్ మీడియా విభాగం పనితీరును జగన్ పరిశీలించారు. వైసీపీ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా తనవంతు పాత్ర పోషించింది. విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో ఈ టీమ్ పని చేసింది. నియోజకవర్గాల్లో కూడా సోషల్ మీడియా టీమ్స్ ఏర్పాటయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు వస్తాయని భావించిన వారు కాస్త అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాయకులను పిలిపించుకుని అర్హత ఉన్నవారికి కొన్ని పదవులు కట్టబేట్టే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది.