ఏపీలో ప్రభుత్వం.. రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య మళ్లీ వార్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్.. మరోపక్క ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేని రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండింటి మధ్య ట్యాగ్ ఆఫ్ వార్ నడుస్తోందే కానీ.. ఎవరూ కూడా తగ్గేలా లేరు. దీంతో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లారు.
హైకోర్టు ఏమందంటే..
ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు నిధులు ఇవ్వడం లేదని.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సహకరించట్లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రిట్ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ కు సహకరించాలని సూచించింది. నిదుల విషయంలో ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఓ రాజ్యాంగ సంస్థ అడగాలా అని ప్రశ్నించింది. అయితే.. తాము రూ.40 లక్షలకుగాను రూ.39 లక్షలు ఇప్పటికే విడుదల చేశామని దీనిపై ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ.. ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ సంప్రదించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం ఏయే విషయాల్లో సరిగా సహకరించడంలేదో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ఎన్నికల కమిషన్ ను హైకోర్టు ఆదేశించింది.
మళ్లీ వార్ తప్పదా..
నిజానికి ప్రభుత్వానికి ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదు. నిమ్మగడ్డను తప్పించినా కోర్టు ఉత్తర్వులతో ఆ పదవిలో కూర్చోబెట్టాల్సి వచ్చింది. గతంలో కూడా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేమని కూడా కోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణ అంటే ఎన్నికల కమిషన్ కు నిధులు ఎక్కువగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నిధుల గురించి చెప్తూ.. ఎన్నికల నిర్వహణకు నిధుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు నిమ్మగడ్డ. దీనిపై మళ్లీ కోర్టు స్పందించింది. నిజానికి నిమ్మగడ్డ ఆ పదవిలో ఉన్నంతవరకూ ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం లేదు. కానీ.. కోర్టుకు వెళ్లైనా ఎన్నికలు నిర్వహించాలనేది నిమ్మగడ్డ ఆలోచన. మరి వీరిద్దరి వాదనలో హై’కోర్టు’లో ఎన్నికల బంతి ఉంది. మరి ఆ బాల్ ను ఎవరి వైపు అనుకూలంగా విసురుతుందో కోర్టు మాత్రమే నిర్ణయించాలి.