రాజు గారి చిన్న భార్య అందగత్తె.. అని అంటే పెద్ద భార్య అందంగా లేనట్టే కదా.. అని ఓ సామెత ఉంది. అలా ఉంది ప్రస్తుతం టీడీపీ పరిస్థితి. మాస్ పద్ధతిలో చెప్పాలంటే మింగాలేక.. కక్కాలేక అన్నమాట. తప్పుని తప్పని చెప్పలేక, అందులో తాము చేసింది కూడా ఉంది గనక, అసలు మాట్లాడకపోతే మరీ తప్పవుతుంది కనక.. మొత్తంగా తన వాళ్లను కాపాడుకోవడానికి పడుతున్న తాపత్రయం.. ప్రయత్నాలనే తెలిసిపోతున్నాయి. విశాఖలోని గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుందంటూ అధికారులు ఆ భూముల స్వాధీనానికి తెర తీసిన విషయం తెలసిందే. జేసీబీతో కూల్చివేతలు జరిగాయి. దీంతో అలర్టయిన టీడీపీ చంద్రబాబు, లోకేశ్ తోపాటు నేతలందరూ స్పందించేస్తున్నారు. అయితే..
టీడీపీ.. అలా అనలేక..! ఇలా..
వైసీపీ కూల్చివేతలకు పాల్పడుతోంది.., నోటీసులు ఇవ్వకుండానే విధ్వంసాలకు పాల్పడుతున్నారు, ఇది అరాచక పాలన అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ.. ‘అవి అక్రమ కట్టడాలు కాదు, ఆక్రమణ జరగలేదు, అంతా పక్కాగా కొనుక్కున్న స్థలమే’ అని ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా అనటం లేదు. లేదూ.. గీతం సంస్థ కూడా చెప్పడం లేదు. ‘ఇలా కూల్చేయడం దారుణం’ అనే మాట తప్పించి మరో మాట లేదు. అధికారంలో లేనప్పుడు టీడీపీకి గీతం ఓ ఆర్ధిక వనరు అనే మాట ఉంది. పైగా.. హీరో బాలకృష్ణ అల్లుడు.., బంధుత్వం, మిగిలిన ఫ్యాక్టర్స్ కూడా తోడయ్యాయి. దీంతో గీతంకు టీడీపీ మద్దతు మాత్రమే ఇస్తోంది. అవి ఆక్రమణలు కాదు.. సక్రమాలే అని చెప్పలేకపోతోంది ఇందుకే. మొన్నటికి మొన్న సబ్బం హరికి ఇంటి దగ్గర కూడా ఆక్రమణలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు గీతం.
అప్పట్లోనే ఎందుకు క్రమబద్దీకరించలేదు..
వైసీపీ నేతలు కూడా ఇదే అంటున్నారు. నిజంగా గీతం సంస్థ ఆక్రమణలకు పాల్పడకపోతే ప్రభుత్వం ఎందుకు కూల్చి వేస్తుంది? ఆక్రమణలే లేకపోతే గత టీడీపీ హయాంలోనే ఎందుకు క్రమబద్దీకరణ చేయలేదు? అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఏ టీడీపీ నాయకుడి దగ్గరా సమాధానం లేదు.. ఉండదు. గీతం ఆక్రమించింది అని చెప్తున్న 40 ఎకరాలే కాదు.. చాలా ఆక్రమణలు ఉన్నాయని అంటున్నారు. అధికారం అండతో భూములను ఆక్రమించుకున్నారని తెలుస్తోంది. ఇందులో నిజం ఉంది కాబట్టే టీడీపీ నేతలు అడ్డగోలుగా స్పందిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.