చట్టానికి ఎవరూ చుట్టం కారనేది నిజం. కొన్నేళ్ల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో 10 కోట్లు లంచం తీసుకుని బెయిల్ మంజూరు చేసిన జడ్జినే అరెస్టు చేశారు. దీనిని సాక్ష్యాలతో సహా నిరూపించింది కూడా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కావడం విశేషం. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపైనే చట్టం తన పని తాను చేసింది. వారి పిల్లలు, బంధువుల విషయంలో ఎందుకు వ్యతిరేకంగా పని చేస్తుంది? ఏపీ సీఎం జగన్ న్యాయ వ్యవస్థతో పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులకు సంబంధించి అమరావతిలో జరిగిన లావాదేవీలను బయటకు తీసి వాటిని ఆరోపణల రూపంలో సీజేఐకి అందించారు కూడా. ఈ లావాదేవీలు బ్యాంకు సిబ్బంది ద్వారానే బయటకు వచ్చాయనే ఆరోపణలతో వారిపై బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే..
ప్రభుత్వమే చేసిన ఆరోపణలు
అమరావతిలో భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. టీడీపీతో అనుబంధంగా ఉన్న న్యాయ విభాగంలోని పెద్దలు కొందరు.. వారి సన్నిహితులు కొందరు భూములు పొందారనేది వైసీపీ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు భూములు పొందారని సీఎం జగన్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు వెనుక ఆధారాలుగా చూపిన బ్యాంకు లావాదేవీలు ఎలా బయటకు వచ్చాయని ఆరా తీసి సదరు బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఏసీబీ అడిగిన వివరాలు ఇచ్చిన బ్యాంకు అధికారులే బాధితులుగా మారారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
వివరాలు ఇవ్వడమే తప్పైంది..
అమరావతి భూకుంభకోణం విషయంలో బ్యాంకు లావాదేవీల వివరాలు ఇచ్చిన ఐదుగురిపై పనిష్మెంట్ బదిలీ పడింది. ముగ్గరు చెన్నైకు ఇద్దరు ముంబైకు బదిలీ చేశారు. దీనిపై యూనియన్లు కూడా ఏం మాట్లాడటం లేదు. షెడ్యూల్ ప్రకారం బదిలీలు జరిగే బ్యాంకుల్లో తప్పు చేయకపోయినా ఇలా హఠాత్తుగా బదిలీ చేయడం.. వారిలో ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండటంతో అసంతృప్తి రగులుతోంది. వారివైపు చట్టం ఒకలా.. మావైపు చట్టం మరొకలా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అనేకమంది న్యాయ నిపుణులు ఇందులోని వాస్తవాలు గ్రహంచాలనే వాదనలూ వస్తున్నాయి.