ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న అంశం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చెప్పాలంటే సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నట్టుగా తయారయ్యాయి పరిస్థితులు. మార్చిలో కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు నిమ్మగడ్డ ఎస్ఈసీ హోదాలో ప్రకటించిన నాటినుంచి ఈ వ్యవహారం ఇద్దరి మధ్య పోరులా మారిపోయింది. ఇటివల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్ ముందుకొచ్చింది. ఆల్ పార్టీ మీటింగ్ కూడా నిర్వహించింది. దీంతో మరోసారి రెండు వ్యవస్థ మధ్య పోరు మళ్లీ మొదలైంది. దీనిపై మేధావులు స్పందిస్తున్నారు.
నిమ్మగడ్డను చంద్రబాబు ఎదగనీయలేదు..
చంద్రబాబు తొత్తుగా వ్యవరించబట్టే నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసారని వైసీపీ అంటోంది. కానీ.. ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా చేసిన నిమ్మగడ్డను చంద్రబాబు ఎదగనీయకుండా తొక్కేసిన విషయం అధికారవర్గాల్లో తెలిసిన విషయం అంటూ కొందరు రాజకీయ మేధావులు అంటున్నారు. నిమ్మగడ్డను చంద్రబాబు అప్రధాన్యమైన పోస్టుల్లోనే ఉంచారని ఎప్పుడూ నెత్తికెక్కించుకోలేదని అంటున్నారు. మార్చిలో ఎన్నికలు వాయిదా వేస్తున్నప్పుడు ఎస్ఈసీ ఎవర్ని అడిగారంటూ వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్నలు అర్ధరహితమంటున్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు మాత్రమే పార్టీల అభిప్రాయం తీసుకుంటుందని.. వాయిదాలు, రీపోలింగ్ వంటి అంశాలపై కాదనేది వారి మాట. ఎన్నికల కమిషన్లు కూడా రాజకీయ పార్టీల ఒత్తిడులకు లోనైన సందర్భాలున్నాయని అంటున్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సింది అధికార పక్షమే..
నిజానికి రాజ్యంగ వ్యవస్థల్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పక్షానికే ఎక్కువగా ఉంటుంది. రాజ్యాంగ వ్యవస్థలపై పెత్తనం చెలాయించడం ప్రభుత్వాలకు కుదరని పని. ప్రభుత్వం తరపున సీఎస్ నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ ను కలిసి కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహించలేమని చెప్పారు. ఆల్ పార్టీ మీటింగ్ కు సొంత పార్టీ నేతల్ని నిలువరించిన అధికార పక్షం రాజ్యాంగ వ్యవస్థల్ని వ్యక్తుల్ని ఆపలేకపోయింది. నిమ్మగడ్డ ఉండగా ఎన్నకల నిర్వహించకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉందని అర్ధమవుతోంది. అయితే వీటివల్ల ప్రజలకు జరిగే నష్టమే ఎక్కువ. ఇప్పటికైన ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పై తన అభిప్రాయం మార్చుకోవాలని పరోక్షంగా తమ అభిప్రాయం చెప్తున్నారు కొందరు మేధావులు.. రాజకీయ పరిశీలకులు.