KCR: కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటమే గుర్తొస్తుంది. రాష్ట్రం సాధించి 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి సీఎంగా ఉన్నారు. అయితే.. రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి పీఠంతో కేసీఆర్ లక్ష్యం పూర్తవలేదా..? ప్రధాని పదవి వైపు చూస్తున్నారా..? అంటే.. ప్రస్తుతం ఆయన తీరు అదే తలపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. కానీ.. ఈసారి తగ్గేదేలే.. అనేట్టుంది ఆయన తీరు. మొన్న ప్రెస్ మీట్ లో బీజేపీ, మోదీపై నిప్పులు చెరగడం, నిన్న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు గైర్హాజరీ.. ఇదే నిరూపిస్తోంది.
KCR ఈసారి గట్టిగానే కేసీఆర్..
హైదరాబాద్ లో విమర్శించి.. ఢిల్లీలో షేక్ హ్యాండ్ ఇస్తారనే కామెంట్స్ కేసీఆర్ పై ఉన్నాయి. ఈసారి వాటికి చెక్ పెట్టేలా నిన్న ఆయన తీరు ఉందని చెప్పాలి. ప్రధాని వచ్చినా ఆహ్వానించలేదు.. కార్యక్రమాల్లో కేసీఆర్ ఉండాల్సి ఉన్నా పాల్గొనలేదు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులు తనవైపు చూసేలా వ్యవహరించారని చెప్పాలి. రాజకీయంగా మోదీని ఢీకొట్టాలని ఎందరికి ఉన్నా.. మమతా బెనర్జీ తప్పితే ఎవరూ కనిపించరు. కానీ.. మొన్న బడ్జెట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా రెండున్నర గంటలు బీజేపీని, మోదీని ఏకిపారేశారు. ఆయన ప్రశ్నలకు బీజేపీ నుంచి సమాధానమే లేదు. ఇదంతా 2024 ఎన్నికల ముందు పూరించిన శంఖమా..? ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే వ్యూహమా..? వీటి వెనుక ఎవరున్నారు..?
పీకే వ్యూహమేనా..
ఇటివలే ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ కోసం పని చేయడం ప్రారంభించారని వార్తలు వచ్చాయి. ఆ వెంటనే ప్రెస్ మీట్, ప్రధాని మోదీ పర్యటన జరిగాయి. రెండింటిలో కేసీఆర్ వెనుక పీకే మార్క్ కనిపిస్తోందనే విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ కు అండగా బీజేపీకి వ్యతిరేకి అయిన పీకే ఉన్నారనే ధైర్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇటు ఏపీలో కూడా సీఎం జగన్ బీజేపీని వ్యతిరేకించి పీకే ద్వారా కేసీఆర్ కు దగ్గర కావొచ్చనే ఊహాగానాలు లేకపోలేదు. ఏదేమైనా.. మోదీకి మొన్న పంజాబ్ లో ఓ షాక్.. ఇప్పుడు తెలంగాణలో మరో షాక్. మొత్తంగా.. బీజేపీ, మోదీని గద్దె దించేందుకు కొత్త శక్తులు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా..? రాబోయే రోజుల్లో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో చూడాల్సి ఉంది..!