ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ కానున్న విషయం తెలిసిందే కదా. ఇంతలోనే మరో వార్త ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారట. ఆయన కూడా ప్రధాని మోదీని కలవనున్నారట.
ఈసారి తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేయనున్నారట. అయితే.. కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉంటుంది అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ.. జగన్ వెళ్లిన తర్వాత కొన్ని రోజులకే ఉంటుందని తెలుస్తోంది.
ఢిల్లీలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అయి.. తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంపై చర్చిస్తారట. అలాగే ఏపీతో తెలంగాణకు ఉన్న సమస్యల విషయంపై కూడా కేసీఆర్ ప్రధాని దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏపీ సీఎం జగన్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం జగన్.. కృష్ణా నది జలాల విషయంపై మోదీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏపీకి రావాల్సిన నిధులపై కూడా ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారు.
మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దానిపై కూడా జగన్.. మోదీతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ అభ్యంతరాలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇదే విషయాన్ని ప్రధానికి ఫిర్యాదు చేయనున్నారా? అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.