Cm Kcr: సీఎం కేసీఆర్ Cm Kcr అంటే అభినవ ఉద్యమకారుడు. నేటి సమాజానికి ఉద్యమాన్ని ఎలా నడిపించాలో చూపిన వ్యక్తి. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి. 13 ఏళ్ల నిరంతర పోరాటం.. వచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా పోరాడి రాష్ట్రం సాధించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ నినాదం ఆయన శ్వాసగా పోరాటం చేశారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే తన ధ్యేయంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. కరోనా సోకితే తెలంగాణ ప్రజలు ఏం చేయాలో గతేడాది చెప్పిన మాటలకు ఇప్పుడు ఆయన చేసినదానికి పొంతన లేదని చెప్పాలి.
గతేడాది.. ఇప్పుడు కూడా గాంధీ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. గాంధీ వైద్యులు శక్తికి మించి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం సీఎంకు కరోనా సోకింది. ఆయనకు ఉన్న పరిమితుల దృష్ట్యా ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకోవడమే కరెక్ట్. సామాన్యులకు ఎవరికీ ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత, సౌకర్యాల మధ్య ఇది సబబే. అయితే.. ముఖ్యమైన టెస్టుల కోసం ఆయన నిన్న యశోద ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. కానీ.. అవే టెస్టులు ప్రభుత్వాధినేతగా గాంధీలోనో, నిమ్స్ లోనో జరిపించి ఉంటే ప్రజల్లో మరింత భరోసా కల్పించినవారు అయ్యుండేవారని చెప్పాలి. యశోదలో చేసిన పకడ్బందీ ఏర్పాట్లే గాంధీ, నిమ్స్ లో చేయడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు.
కానీ.. సాక్షాత్తూ సీఎం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారంటే గాంధీ, నిమ్స్ లో అటువంటి టెస్టులు, సౌకర్యాలు లేవని ప్రజలు భావించాలా? సామాన్యులెందరో వెళ్లలేని కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య వసతులు లేవనా? ప్రభుత్వాసుపత్రుల్లో ఒకవేళ ఇటువంటి సౌకర్యాలు ఉన్నా.. సీఎంగా కేసీఆర్ ఇక్కడే టెస్టులు చేయించుకునుంటే ప్రభుత్వ ఖ్యాతి ఇంకా ఇనుమడింపయ్యేది. తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఇంతగా చేపట్టాం, నిర్వహిస్తున్నాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఇంకా గర్వంగా చెప్పుకునే అవకాశం కూడా ఉండేదని చెప్పాలి.