ఏపీ నాయకులు.. తెలంగాణను కలుపుకుని ‘రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు’, ‘మనం తెలుగు వాళ్లం’ అంటూంటారు. కానీ.. దాదాపు తెలంగాణలోని రాజకీయ పార్టీల నాయకులు, మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ అధినాయకుడి నుంచి గల్లీ నాయకుడు వరకూ ( తెలంగాణ ప్రజలు కాదు ) అందరూ ‘తెలంగాణ ప్రజలు’, ‘మన తెలంగాణ బిడ్డలు’ మినహా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు అని దాదాపు ఎప్పుడూ అనలేదు. ఎన్నికల సందర్భాల్లో ‘సెటిలర్లు అంతా తమవాళ్లే’, టీఆర్ఎస్ అంటే.. ‘తెలుగు రాష్ట్ర సమితి’, ‘భీమవరం వాళ్లు మంచోళ్లు’.. అనే మాటలు తప్ప మరెప్పుడూ ఆంధ్ర ప్రజలకు పెద్ద ప్రాముఖ్యత ఇచ్చింది లేదు. సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపుతాయి కాబట్టి.. ఆమాత్రం వారికి తప్పటం లేదు.
ఏపీపై కేసీఆర్ తీరు మారిందా..?
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కూడా సీఎం కేసీఆర్ తన బహిరంగ సభలో మాటల తూటాలు పేలుస్తూనే ఆంధ్రపై ఉన్న ఏవగింపునూ, కక్షను కాస్త పక్కనపెట్టారు. ఈసారి గ్రేటర్ పోరు అసెంబ్లీ ఎన్నికల తరహాలో జరుగుతూండటంతో తన వాదనను కేంద్రం వైపు మళ్లించారు. 2001 నుంచీ ఆంధ్రోళ్ల పెత్తనం.. అనే నినాదంతో వచ్చి రాష్ట్రం సాధించి, ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. ఇప్పటికీ గత ప్రభుత్వాల తీరుపై దుమ్మెత్తిపోసే కేసీఆర్ ఈ బహిరంగసభలో తన రూటు మార్చారు. సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు. మతాల చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత గ్రేటర్ ప్రచారంపై ఆచితూచి మాట్లాడారు. ఈ బక్క పలచని వ్యక్తి కోసం కేంద్రం నుంచి వస్తున్నారు. మన తెలంగాణను మనమే అభివృద్ధి చేసుకోవాలి.. అంటూ స్థానికంపై మాత్రమే మాట్లాడారు.
సీఎంకు సంకేతాలు అందాయా..?
ఏ రాష్ట్రం నుంచి వచ్చినవారినైనా తమ వారిగానే చూసుకుంటున్నాం.. అంటూ సుతిమెత్తగా మాట్లాడారు. గ్రేటర్ లో ఎదురుగాలి తప్పడం లేదనే సంకేతాలు, ప్రభుత్వం తీరుపై వ్యతిరేకత, వరదల్లో ప్రభుత్వ వైఫల్యం.. ఇవన్నీ కేసీఆర్ కు తెలియనివి కావు. దుబ్బాక ఎన్నికల ఫలితాలకు ముందే వరదలు వచ్చాయి. దుబ్బాక ఫలితం తర్వాతే వరద బాధితుల ఆసరా, ఇంటి పన్నులపై రాయితీ.. వంటి వరాలు ప్రకటించారు. ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అందిన సంకేతాలే. అందుకే స్థానిక అంశాలపై మాత్రమే దృష్టి పెట్టి బీజేపీ నాయకుల్ని మాత్రమే దూనమాడారు. ఇది కేసీఆర్ లో మార్పు అని చెప్పలేం కానీ.. పరిస్థితులు తెచ్చిన మార్పు అని చెప్పాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?