పొలిటికల్ మిర్రర్
పీకేపై ఈగ కూడా వాలకూడదు. పీకేకి దోమ కూడా కుట్టకూడదు. పికెపై కనీసం మారు మనిషి నీడ పడకూడదు. పీకే మన రాష్ట్రానికి ‘ముఖ్యమంత్రి’ స్థాయి ఉన్న ముఖ్య అతిథి. ఈ భావనలన్ని ఎవరివో తెలియక తికమక పడొద్దు. విషయమేంటంటే రాజకీయ సూత్రధారి పీకే ఆలియాస్ ప్రశాంత్ కిషోర్కి Z కేటగిరీ భద్రత కల్పిస్తూ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ముఖ్య అతిథిగా తిరిగి వెళ్లొచ్చు. దేశంలోని చాలా మంది సీఎంలకు ఉన్న ఈ భారీ భద్రత ఈ పొలిటికల్ ఎనలిస్టుకి పశ్చిన బంగాలో కల్పించారు. ఎందుకు? అక్కడ ఆయన అంత ముఖ్యమా? ఆ రాష్ట్ర ప్రభుత్వం పికెపై ఎందుకు అంత ప్రేమ ఒలకబోస్తుంది..? అనేది పరిశీలిస్తే….!
రాష్ట్రంలో “మమత” మార్కు..!
పశ్చిమ బంగ రాష్ట్రం… అది 2011 మే..! శాసనసభ ఎన్నికల్లో 295కి గాను184 సీట్లు గెలుచుకుని మమత బెనర్జీ ఆ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అక్కడి మొదలు తన మార్కు నిర్ణయాలు, పాలనతో రాష్ట్రంలో చక్రం తిప్పారు. వివాదాస్పద నిర్ణయాలు, దూకుడు పాలనతో విమర్శలుపాలైనప్పటికీ… ప్రజల్లో పట్టు సాధించి, మళ్ళీ 2016 ఎన్నికలు వచ్చేసరికి ఆమెనే ఆ రాష్ట్ర ఓటర్లు గెలిపించారు. 295 సీట్లకి గాను 211 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుని, ఆమె వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. బిజెపి అంటేనే ఒంటికాలుతో లేస్తారు మమత. మోడీ, అమిత్ షా ద్వయంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దేశమంతటా బీజేపీని ఓడించాలని మొన్నామధ్య చంద్రబాబు, కాంగ్రెస్ తో కలిసి కూటమి కూడా కట్టారు. అందుకే మమతని ఎలాగైనా గద్దె దించాలని బిజెపి ఎత్తులు వేస్తుంది. ఎలాగైనా తాను మూడోసారి గెలిచి తన పట్టు నిలుపుకోవాలని మమత సిద్ధమవుతున్నారు. అందుకే రానున్న శాసనసభ ఎన్నికలు పశ్చిమబెంగాల్ లో అప్పుడే రాజకీయ కాకని రగిలించాయి.
పీకే అక్కడ కీలకం ఎందుకంటే…!
ప్రశాంత్ కిషోర్ ఆ రాష్ట్రంలో ఇప్పుడు కీలకమయ్యారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి ఆ రాష్ట్రంలో ని 42 పార్లమెంటు స్థానాలకు గాను18 స్థానాలొచ్చాయి. 2014లో కేవలం 2 మాత్రమే గెలిచిన బిజెపి 2019 నాటికి పుంజుకుంది. అందుకే ఇప్పుడు అక్కడ మమతకి సరైన ప్రత్యామ్నాయం బిజెపి అని జనంలో ఉంది. బీజేపీని, ఆ పార్టీ నిర్ణయాలను బలంగా విమర్శిస్తున్న నాయకుల్లో మమత కీలకంగా ఉండడం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటూ జాతీయవాదంతో దేశమంతటా బిజెపి గాలి ఉండడం, స్వ రాష్ట్రంలో తనకు రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువవ్వడం, గత రెండేళ్లలో తృణమూల్ నాయకులపై కేసులు, ఇబ్బందులతో పార్టీకి దూరమవుతుండడంతో మమతకి ఈ ఎన్నికలు చావో రేవో అన్నట్టు మారాయి. కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అందుకే మమత తనకు తోడుగా ప్రశాంత్ కిషోర్ ని తెచ్చుకున్నారు. ఏడాది కిందటే పీకే తో ఒప్పందం చేసుకున్నారు. “దీదీకో బోలో” అంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా దేశంలో సీఏఏ, ఎన్ఆర్ సి లను బలంగా వ్యతిరేకిస్తున్న వారిలో పీకే కూడా ఉన్నారు. తనలాగే ఆయాన కూడా బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారు, అందుకే ఆయనకు భద్రత ముఖ్యం అని భావించిన దీదీ వెంటనే పీకేకి Z కేటగిరీ భద్రత కల్పించేశారు. పికెపై ఈగ కూడా వాలకుండా, సంపూర్ణ రక్షణ కల్పించి తనకు తోడుగా నిలిచేలా చేసుకున్నారు దీదీ. ఇదే మమత మార్కు అంటే.
శ్రీనివాస్ మానెం