YS Jagan: తీవ్ర ఉత్కంఠ మధ్య రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ కట్టడి, నియంత్రణ చర్యలపై చర్చ.. అన్నింటికీ మించి పీఆర్సీ జీవోలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంతకుముందే ప్రకటించిన ఈ నిర్ణయాలను ఇప్పుడు అధికారికంగా మంత్రివర్గం ఆమోదించింది. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో రగులుతున్న పీఆర్సీపై మాత్రం ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. పైగా.. అయిదుగురు మంత్రులతో కమిటీ వేశారు. ఉద్యోగులు కూడా పట్టు వదలకుండా ఫిబ్రవరి 7నుంచి సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలతో ఇకపై రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
క్యాబినెట్ నిర్ణయాలు..
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62ఏళ్లకు పెంపు.. కరోనాతో మృతి చెందిన కుటుంబాల్లో కారుణ్య నియామకాలు, జగనన్న స్మార్ట్ టౌన్షిప్లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయింపు, ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు, వారానికి 4 ఇండిగో సర్వీసులు నడిపేలా 20కోట్ల చెల్లింపుతో ఒప్పందం, ఈబీసీ నేస్తం అమలు.. ఇవన్నీ (YS Jagan) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. వాటికి ఆమోదముద్ర. అయితే.. వీటిలో ప్రభుత్వోద్యోగులకు లబ్ది చేకూరేలా తీసుకున్న కొన్ని నిర్ణయాలు మొదట్లో ఉద్యోగులు సంబరపడ్డవే. అయితే.. ఇప్పుడీ నిర్ణయాలు వారికి ఏమాత్రం రుచించనివి. కారణం.. పీఆర్సీతో తమకు ప్రభుత్వం అన్యాయం చేసిందనే ఆగ్రహంతో ఉద్యోగులు ఉన్నారు. కేవలం ఒక్కరోజులో ఉవ్వెత్తున లేచిన ఉద్యోగుల నిరసన రాష్ట్రాన్ని అట్టుడుకించాయి. అయితే.. ప్రభుత్వం ఏమాత్రం చలించలేదు.
సంఘాలతోనే ఉద్యోగులు..
దీంతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఓ నిర్ణయానికి వచ్చేశాయి. నిబంధనల ప్రకారం 17 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. దీని ప్రకారం సోమవారం సీఎస్ కు నోటీసులు ఇచ్చి ఫిబ్రవరి 7నుంచి సమ్మెకు వెళ్లనున్నాయి. నిజానికి ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఉద్యోగులు. కానీ.. ఇకపై వారంతా ఉద్యమాల్లో ఉంటారు. ఉదాహరణకు.. కొత్త పీఆర్సీతో జనవరి నెల జీతాలు వేయాలని ట్రెజరీకి ఆదేశాలు వెళ్లినా.. ఉద్యోగులు మాత్రం తాము ఉద్యోగ సంఘాల నాయకుల సూచనలే పాటిస్తాం.. మేమూ సమ్మెలోనే ఉంటామని ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. దీంతో పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారబోతున్నాయో తెలుస్తోంది. దీంతో (YS Jagan) ప్రభుత్వం ఒక మెట్టు దిగుతుందనే భావించారు అంతా..! కానీ..
తగ్గేదెవరు.. నెగ్గేదెవరు..
సీఎం (YS Jagan) జగన్ ఎక్కడా తన మార్కు వీడలేదు. పీఆర్సీపై ముందుకే వెళ్లారు. పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం. అయినా.. వారి డిమాండ్లకు తలొగ్గలేదు. ముందు వారడిగిన 30లో 27 శాతం ప్రకటిస్తే.. 30కి డిమాండ్ చేస్తారని.. 23 ప్రకటించారు కాబట్టి.. వ్యతిరేకిస్తే.. 27శాతం ప్రకటించి ఉద్యోగులు వారికి వారే శాంతపడేలా చేస్తారని అంతా భావించారు. కానీ.. ఆర్ధికలోటు అనే మాటకే కట్టుబడి.. ఇంతే ఇవ్వగలమని తేల్చి చెప్పేశారు. ఉద్యోగుల జీతాలు తగ్గవని ప్రభుత్వం.. పాత జీతాలే ఇవ్వండని ఉద్యోగులు.. నువ్వా-నేనా అని తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగుల ఉద్యమాలు జగన్ కు.. ప్రభుత్వాల తీరూ ఉద్యోగులకు తెలీనది కాదు. మరి.. రాబోయే రోజుల్లో ఎవరెక్కడ తగ్గుతారో.. ఎక్కడ నెగ్గుతారో చూడాల్సి ఉంది.