YS Jagan :ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉందా..? జీతాలకు కూడా వెతుక్కుంటోందా..? ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీకి కూడా నిధులు సమకూర్చడం లేదా..? అంటే అవునని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పుల్ని మించి ప్రస్తుతం అప్పులపాలైనట్టు తెలుస్తోంది. ప్రతిపక్షనేతగా చేసిన సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో వర్గాల ప్రజలకు మరెన్నో హామీలు గుప్పించిన వైఎస్ జగన్ YS Jagan అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కాదనలేని వాస్తవమే ఉంది.
అయితే.. ప్రభుత్వ ఖజానా ఇందుకు సిద్ధంగా ఉందా అనేది మాత్రం ఆయన చూడలేదు. నవరత్నాలే అజెండాతో అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్ కు ఇప్పుడు రాబడి కంటే ఖర్చే ఎక్కువగా కనబడుతోంది. అందుకే.. ఎప్పటిలా ప్రతిపక్షాలపై తన నోటికి పని చెప్పడం లేదు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి.
ఖర్చులకు తగ్గ ఆదాయం లేదా..?
‘వయసు చిన్నది.. బాధ్యత పెద్దది’ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం రోజున అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందుకు తగ్గట్టే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తనదైన మార్క్ పాలనతో జగన్ దూసుకెళ్తున్నారు. కరోనా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా టెస్టులు, కట్టడికి తీసుకున్న చర్యలు, బాధితుల పట్ల వైద్యశాఖ స్పందించిన తీరు ప్రశంసనీయమే. ఇలా మంచి మార్కులే వేసుకుంది ప్రభుత్వం. అయితే.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముందుంది. పథకాలకు విపరీతంగా ఖర్చు చేస్తూ.. రాబడికి తగ్గ ప్రయత్నాల్లో విఫలమవుతోంది. ఏపీ నెలసరి ఖర్చు 20వేల కోట్ల వరకూ ఉంటే.. రాబడి 9వేల కోట్ల వరకూ ఉంది. ఇవన్నీ పన్నులు.. ఇతరత్రా ఆదాయాలతో సమకూరుతోంది.
గతంలోనే ప్రభుత్వోద్యోగులకు జీతాల విషయంలో ఇబ్బందిపడ్డ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ అవస్థలు పడుతోంది. ఇంకా కొందరు ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్లు ఇవ్వలేదని సమాచారం. ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం, రాబడి మార్గాలు లేకపోవడం ప్రభుత్వానికి ప్రతికూలంగా మారుతోంది. పన్నుల రూపంలో కొంత పెంచినా మళ్లీ మళ్లీ పెంచితే ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని సీఎం ఆదిత్యనాధ్ దాస్ కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్.
ఆరోగ్యశ్రీ పరిస్థితేంటి..?
మరోపక్క తండ్రి వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ పథకమే వైఎస్ కు బ్రాండ్ అంబాసిడర్ లా నిలిచిపోయింది. ఉమ్మడి ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలైనా.. ప్రభుత్వాలు మారినా ఎవరూ ఈ పథకం జోలికి వెళ్లలేదు. అంత శక్తివంతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఇప్పుడీ పథకానికే.. అదీ ఏపీలో నిధుల లేమి కనిపిస్తోంది. దాదాపు 1800 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. దీంతో ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలిచిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకడంలేదని తెలుస్తోంది. పెండింగ్ జీతాలకే 2000 కోట్లు అవసరమైన వేళ ఇప్పుడు ఆరోగ్యశ్రీకి అవసరమైన 1800 కోట్లు అప్పు ఎక్కడ పుడుతుందనేది ఓ ప్రశ్నగా మారింది. అయితే.. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో కాస్త ఇబ్బంది ఏర్పడిందని త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది.
పన్నులు పెరుగుతాయా..?
రైతులకు కూడా ప్రభుత్వం బకాయిలు పడింది. ఫిబ్రవరిలో 4500 కోట్లు రైతు భరోసాకు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం నగదు లేమితో ఈ పథకానికి నగదు బదిలీ ఆగిపోయింది. కాంట్రాక్ట్ బిల్లులు కూడా భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోవడంతో కొత్త కాంట్రాక్టులపై కూడా కాంట్రాక్టర్లు దృష్టి సారించడంలేదని తెలుస్తోంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో ముందు రైతు భరోసా మొత్తాల్ని చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు.. తర్వాత మున్సిపల్ ఎన్నికలతో ప్రభుత్వం బిజీగా ఉండనుంది. ఈ నేపథ్యంలో రాబడిపై, ఖర్చులపై ప్రభుత్వం దృష్టి తగ్గింది. ఎన్నికలు పూర్తయ్యాక వీటన్నింటిపై దృష్టి సారించి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించనుందని తెలుస్తోంది. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా రాష్ట్ర రహదారులపై టోల్ గేట్ల ఏర్పాటు, మద్యం మాల్స్ ఏర్పాటు చేసి పేరున్న బ్రాండ్లు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కొత్త ఆలోచనలతో ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాలి.