అమరావతి: సచివాలయానికి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన లక్ష్యాలు, ఆశయాలను ఉన్నతాధికారులకు వివరించి తదనుగుణంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల సమావేశంలో సిఎం జగన్మోహనరెడ్డి మాట్లాడారు. మన పాలన దేశానికి ఆదర్శంగా ఉండాలనీ, ఇందుకు అందరూ సహకరించాలని సిఎం జగన్ కోరారు. అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న ధృఢ సంకల్పంతో ముందుకు సాగాలని జగన్మోహనరెడ్డి విజ్ఞప్తి చేశారు.
అధికారులు సహకరిస్తే ప్రజలు, ప్రభుత్వ కల నెరవేరుతుందని జగన్ అన్నారు.
ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సిఎం జగన్ హామీ ఇచ్చారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తదితర అధికారులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు సిఎం జగన్ను కలిసి అభినందించారు. వారి సమస్యల పట్ల సిఎం జగన్ సానుకూలంగా స్పందించారు.
తొలి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు 27శాతం తాత్కాలిక భృతి, సిపిఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సిఎం జగన్ చెప్పారు. ‘సిఎంలతో ఉద్యోగ సంఘాలు సన్నిహితంగా ఉండటం సర్వసాధారణం, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారు.గత ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్న వాళ్లను నేను తప్పుపట్టను’ అని సిఎం జగన్ అన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయాల పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.