YS Jagan: రాజకీయ పార్టీని నడిపించడం కష్టం.. కానీ, అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడిపించడం చాలా తేలిక. కారణం.. ఒక వ్యవస్థ, అధికారులు, అధికారం.. ఉంటుంది కాబట్టి.. వాళ్లని వెనకుండి నడిపిస్తే చాలు.. నడిచిపోద్ది. కాకపోతే.. ఐఏఎస్ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ.. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఈ విషయం ముఖ్యమంత్రులకు ఒకరు చెప్పేది కాదు. మహామహులు అనదగ్గ సీఎంలకు, రాజకీయ ఉద్దండులకు తెలిసిన విషయమే. అయితే.. (YS Jagan) సీఎం జగన్ మోహన్ రెడ్డికే ఇంకా పరిస్థితి అర్ధం కానట్టుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది.. నేను సీఎం అయ్యాక వారంలో సీపీఎస్ రద్దు.. ఇంకా వారిని ఆకర్షించే హామీలు ఇచ్చి జగన్ అప్పట్లో ఆకట్టుకున్నారు. కానీ.. సీఎం అయ్యాక అదే ఉద్యోగులతో ఆటలాడుతున్నారు.
ఉద్యోగస్థులం కుటుంబాలతో కలిసి 60 లక్షల మంది ఉంటాం. మాతో పెట్టుకుంటే ప్రభుత్వం మారిపోద్ది అని ఉద్యోగ సంఘాల నాయకుడు చేసిన వ్యాఖ్య (YS Jagan) జగన్ ను కలవరపెట్టే మాట. దీంతో కమిటీ అన్నారు.. పీఆర్సీ అమలు అన్నారు.. కానీ.. ఇప్పటి వరకూ ఏదీ ఓ కొలిక్కి అయితే రాలేదు. ప్రభుత్వ పధకాలు ప్రజలకు వెళ్లాలంటే అధికారులు కావాలి. కానీ.. ఆ అధికారులకు ప్రభుత్వం బాధ్యతగా పెంచాల్సిన జీతాలు మాత్రం పెంచడం లేదు. పధకాలతో లబ్ది పొందిన వారు ఓట్లు వేసినా.. ఒక పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే అధికారుల సహకారం తప్పనిసరి. కానీ.. జగన్ ఇదే విస్మరిస్తున్నారు. ఎన్నో భేటీలు.. ఎన్నో చర్చలు.. కానీ.. నిర్ధిష్టంగా ఇంత పెంచుతామని మాత్రం చెప్పడం లేదు.
దీనిపై తుది అంకంగా నేడు (YS Jagan) సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. కమిటీలు ఎన్ని నివేదికలు ఇచ్చిన సీఎం మాటే ఫైనల్. అయితే.. సీఎం పీఆర్సీ ఇచ్చే ఫిగర్ ఉద్యోగ సంఘాలకు నచ్చుతుందా అనేదే పాయింట్. నా రూటే సపరేటు.. అన్నట్టు జగన్ వెళ్తే ఉద్యోగులు ఊరుకోరు. కానీ.. సీఎం జగన్ కు లేని తలనొప్పిని కోరి తెచ్చుకోవడం ప్రతి విషయంలోనూ అలవాటైందే. కానీ.. ఈసారి ఉద్యోగులు మెచ్చే మాట చెప్తే.. మరో రెండేళ్లు కాదు.. మరో అయిదేళ్లూ కాచుకుంటారు. కానీ.. జగన్ ఆ పని చేస్తారా.. చూడాలి..!