Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం Vizag Steel Plant అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ప్రకంపనలు రేపుతోంది. ఇందుకు సంబంధించి ఏపీలో నిప్పు రాజుకుంది. సీఎం జగన్ చేతిలో ఆయుధాలైతే ఉన్నాయి.. మరి ఈ విషయంలో బీజేపీని జగన్ ఎదిరిస్తారా..? ఎదిరించగలరా..? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది. నష్టాలొస్తున్నాయని ప్రైవేటీకరించేద్దాం.. అని కేంద్రం ఆలోచన వెలుగులోకి వచ్చిన మరుక్షణం ఏపీలో దావానంలా వ్యాపించిందీ అంశం. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతానికి వైజాగ్ స్టీల్ మకుటాయమానంగా నిలుస్తోంది. భావోద్వేగాల అంశం కాదు.. ఉద్యోగాల కల్పనలోనూ విశాఖ ఉక్కు ఆ ప్రాంతంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దీంతో ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.. అన్ని రాజకీయ పార్టీలు. అయితే.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఎంత? సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
విశాఖ ఉక్కు కర్మాగారం..
1966 నుంచి 1970 వరకూ విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే ఉద్యమం మహోద్యమంగా జరిగింది. ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ప్రస్తత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అప్పట్లో విద్యార్ధి సంఘం నాయకుడిగా.. ‘రైలు పట్టాలను తీసి మెడలో వేసుకుంటాం’ అని కూడా నినదించారు. అంతటి భీకర ఉద్యమం, పోరాటం తర్వాత 1971లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన జరిగింది. ఇన్నేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో ఘనతలు, రికార్డులు సాధించింది. భారత్ తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం. 2017-18లో 96కోట్లు లాభం వస్తే.. 2018-19లో నష్టాలు వచ్చాయనేది నిజం. 2020లో కరోనా నేపథ్యంలో ఏకంగా 4వేల కోట్లు నష్టం వచ్చిందని కేంద్రం అంచానా. అయినా.. 1990 నుంచి ప్రారంభమైన ఉక్కు ఉత్పాదన లెక్కలను నేటి వరకూ తీసుకుంటే.. ఈ 30 ఏళ్లకు 25వేల కోట్ల లాభమే కనిపిస్తుంది. ఇలా లాభ నష్టాలనేవి సర్వసాధారణం. ఈ కారణంతోనే సంస్థను ప్రైవేటీకరణ చేస్తారా? అనేది ఆ ప్రాంతవాసుల వాదన. దీంతో ఇప్పుడు అక్కడ ఉద్యమం మొదలువుతోంది. అయితే..
సీఎం వైఎస్ జగన్ నిర్ణయమేంటో..
ఇప్పుడీ అంశంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం కీలకంగా మారుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇది సవాల్ గా, ప్రతిష్టాత్మకంగా.. మరీ ముఖ్యంగా ఇదొక పెద్ద తలనొప్పి అంశంగా మారే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి కేంద్ర నిర్ణయం సరైంది కాదు.. అని తీర్మానం చేసి పంపిస్తే కేంద్రం వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఓవైపు కేంద్రంతో సన్నిహితంగా ఉంటున్న సీఎంకు ఇక్కడి ప్రజల మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వ్యవసాయ బిల్లుల చట్టంపై కేంద్రానికి దేశం మొత్తం మీద తొలిగా సంఘీభావం తెలిపింది జగన్. ఇప్పుడు అదే కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారంపై ప్రైవేటీకరణ అస్త్రం వేస్తోంది. దీనిని అడ్డుకోవాల్సింది జగనే. ఇప్పటికే పార్టీ నేతలందరికీ ఈ విషయంలో ఏం స్పందించొద్దని ఆదేశాలు కూడా వెళ్లిపోయాయి. ఓ సమావేశంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఆచితూచి వ్యవహరించాల్సిన అంశం కావడంతో జగన్ దీనిపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.
కేంద్రం దిగొస్తుందా..?
ఓవైపు రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలించేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. అక్కడి ప్రజలు, నాయకులు ఈ విషయంపై ఎలా స్పందించినా.. ప్రతిష్టాత్మకమైన విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేస్తుంటే సీఎం జగన్ ఉదాసీనంగా చూస్తూ ఉరుకుంటే మాత్రం సహించరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. 2019లో విశాఖలోనే ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను కూడా ప్రైవేటుపరం చేస్తామని ఊగిసలాడిన కేంద్రం.. అనేక ఒత్తిడుల మధ్య వెనక్కు తగ్గింది. ఇప్పుడు ఉత్తరాదికి గుండె వంటి స్టీల్ ప్లాంట్ అంశం సామాన్యమైన విషయం కాదు. అందుకే సీఎం జగన్ తీసుకోబోయే నిర్ణయం మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఖచ్చితంగా జగన్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదు. అయితే.. కేంద్రానికి ఎంత సానుకూలంగా ఈ విషయం తీసుకెళ్లాలి అనేదే ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ నిర్ణయంపై జనసేన దూకుడుగా ఉంది. అవసరమైతే ప్రధానిని కలుస్తా అని పవన్ ఇప్పటికే ప్రకటించారు. టీడీపీ నుంచి నిర్ధిష్టమైన ప్రకటన రాలేదు. బీజేపీ డోలాయమానంలో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం యూటర్న్ తీసుకుంటుందో లేదో చూడాలి.