ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ అన్నారు.
‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ అని మోదిని విమర్శించే వాళ్లే వెనకడుగు వేస్తారు. ప్రియాంక గాంధీని వారణాసి నుంచి బరిలోకి దింపకపోవడం ఇందులో భాగమే. ఆమె రాజకీయ జీవితానికి ఆదిలోనే ఫుల్స్టాప్ పడుతుందని ప్రియాంక యూటర్న్ తీసుకున్నారు’ అంటూ బాబా రామ్దేవ్ విమర్శించారు.
బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టో గురించి బాబా రామ్దేవ్ మాట్లాడుతూ.. తాను మేనిఫెస్టోను సమర్దిస్తున్నాననీ, ఇందులో పొందు పరచిన అంశాలను బిజెపి అమలు చేస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోది బరిలో నిలిచిన వారణాసి లోక్ సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నదని ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మరోసారి అజయ్ రాయ్ కే అవకాశం కల్పించింది. దీంతో కాంగ్రెస్ మళ్లీ అజయ్ రాయ్ను బరిలోకి దింపడంపై బాబా రామ్దేవ్ విమర్శలు గుప్పించారు.
ఇదిలా ఉంటే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ ఈ రెండు స్థానాల్లో గెలుపొందితే కచ్చితంగా ఏదో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దీంతో రాహుల్ అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. ఒకవేళ రాహుల్ వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే ప్రియాంక అమేఠీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
దేశమంతా ఎన్నికల హడావిడి నడుస్తున్నా ప్రియాంక పోటీపైనే చర్చ జరుగుతున్నది. వారణాసి నుంచి పోటీ చేయనున్నది అనే వార్తలకు తెరపడిందో లేదో మళ్ళీ ఆమె ఎన్నికల తర్వాత పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరగటం గమనార్షం.