చెన్నై, ఫిబ్రవరి 20: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అన్నా డిఎంకె, పిఎంకె పార్టీలతో బిజెపి పొత్తు పెట్టుకుని సీట్ల సర్దుబాటు చేసుకోగా, ఆ మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ డిఎంకేతో సీట్ల సర్దు బాటు చర్యలకు ఉపక్రమించింది.
డిఎంకె నేత స్టాలిన్ పార్టీ 20నుండి 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుంది. మిగిలిన స్థానాలను భాగస్వామ్య పార్టీలకు ఇచ్చేందుకు సమ్మతిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కెసి వేణుగోపాల్, టిఎన్ ముకుల్ వాస్నిక్లు డిఎంకె నేత స్టాలిన్తో చర్చించేందుకు నేడు చెన్నైవస్తున్నారు.
డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమోళి ఇప్పటికే రెండు పర్యాయాలు ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సీట్ల సర్దుబాటుపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది లోక్సభ స్థానాలు కేటాయించేందుకు డిఎంకె సానుకూలత వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కనిమోళితో భేటీ అయిన అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ కేంద్ర మంత్రులు పి చిదంబరం, ఇవికెఎస్ ఇలంగోవన్, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కెఎస్ అళగిరి, మాజీ అధ్యక్షుడు తిరునవుక్కరుసు, రామస్వామిలతో చర్చించారు.
బుధవారం కాంగ్రెస్ నేతలు వేణుగోపాల్, వాస్నిక్లు డిల్లీ నుండి చెన్నై చేరుకుని డిఎంకె నేతలతో చర్చించి సాయంత్రం నాలుగు గంటలకు సీట్ల ఒప్పందంపై అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
ఇప్పటికే బిజెపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన కూడా చేసింది. మొత్తం 39 లోక్సభ స్థానాలు ఉన్న తమిళనాడులో బిజెపి ఐదు, పిఎంకె ఏడు స్థానాలు కేటాయించి మిగిలిన స్థానాల్లో ఎఐడిఎంకె పోటీ చేయడానికి నిర్ణయానికి వచ్చి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మంగళవారం ముఖ్యమంత్రి ఇ పళనిస్వామి, డిప్యూటి సిఎం ఒ పన్నీర్సెల్వం, పిఎంకె నేత ఎస్ రాందాస్లతో చర్చించి పొత్తులను ఖరారు చేసుకున్నారు.