Huzurabad By Poll: హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యుల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజారాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా అధికార టీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఈటలను దెబ్బతీసేందుకు అధికార టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. నియోజకవర్గంలో అధికంగా ఉన్న దళిత సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునేందుకు కేసిఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేశారు.
Huzurabad By Poll: అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
ఓ పక్క అధికార టీఆర్ఆర్, బీజేపీ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుండే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. మాజీ మంత్రి కొండా సురేఖ ను పోటీకి దింపాలని తొలుత కాంగ్రెస్ పార్టీ భావించింది. పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం కొండా సురేష్ అందుకు పార్టీకి ఒ కండీషన్ పెట్టారు. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో వరంగల్లు ఈస్ట్ నియోజకవర్గ టికెట్ ను తమ కుటుంబానికి ఇవ్వాలని కోరింది. అందుకు పార్టీ హామీ ఇస్తే పోటీ చేస్తానని తెలిపింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికపై నిన్న సీఎల్పీ కార్యాలయంలో మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్శింహ, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు సుదీర్ఘంగా చర్చించారు.
Huzurabad By Poll: పోటీ చేయనని తేల్చి చెప్పిన కొండా సురేఖ
మాజీ మంత్రి కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, రవికుమార్, కన్వంపల్లి సత్యనారాయణ పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపారు. ఈ తరుణంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కొండా సురేఖ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. పోటీ చేయలేనని పార్టీకి తేల్చి చెప్పారు కొండా సురేఖ. చివరి నిమిషంలో కొండా సురేఖ పోటీ చేయలేనని స్పష్టం చేయడంతో పత్తి కృష్ణారెడ్డి, రవి కుమార్ పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభ్యర్థి పేరను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.