శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వదిలిపెట్టేలా లేరు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి ఇంజనీర్లు, సిబ్బంది మృతి చెందిన సందర్భంలో పలువురు కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి అక్కడకు బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో ఆయన కెసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకూ దిగారు. ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. తాజాగా ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనలో క్రిమినల్ కోణం ఉందని రేవంత్ ఆరోపించారు. ఈ ఘటన కారణంగా వంద కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సి బి ఐతో పాటు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సిఇఏ)తో శాఖాపరమైన విచారణకు ఆదేశించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి రాసిన లేఖలో కోరారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. అనుభవం లేని ప్రభాకరరావు ఎండిగా ఉండటం వల్లనే జెన్కో, ట్రాన్స్కోకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభాకరరావు హయాంలో ఇచ్చిన టెండర్లు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. విద్యుత్ను బయట ఎవరి వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కేసును సిఐడికి బదిలీ చేశారు. సిఐడి అడిషనల్ డిజి గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమించగా ఆయన సిబ్బందితో ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తును చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు.