“కాంగ్రెస్ హటావో దేశ్ కి బచావో” అనే నినాదంతో 2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రధానిగా బరిలోకి దిగిన మోడీ అదే రీతిలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్నారు. 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా కాంగ్రెస్ పార్టీని మోడీ ఓడించడంతో ఇప్పుడు ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు విషయంలో పార్టీ కీలక నాయకులు సతమతమవుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ గా రాణిస్తున్న సోనియాగాంధీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండటంతో, పార్టీలో ఎవరో రావాలి, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలి, అన్నరీతిలో పరిస్థితి మారిపోయింది.
ఇంటీరియం అధ్యక్షురాలిగా సోనియా ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బట్టి చూస్తే ఆమె పదవీకాలాన్ని పొడిగించడం అసాధ్యం అన్న టాక్ వస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో… పార్టీ చీఫ్ గా రాహుల్ గాంధీ పదవి నుండి తప్పుకోవడం తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్షురాలిగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా… ఏడాదిపాటు అనేక అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొని ఏడాదిపాటు రాణించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల కొన్ని విషయాలలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు మరియు పార్టీకి సంబంధించి కీలక విషయాలలో ఆయన ఇచ్చిన ఆలోచనలు గతం కంటే భిన్నంగా ఉండటంతో రాహుల్ గాంధీ కి పార్టీ అధ్యక్షుడిగా రాణించే సత్తా ఉందని పార్టీ వర్గాలు కోరుకుంటున్నాయి.
ప్రస్తుతం ఉన్న మీడియా మరియు టెక్నాలజీని తట్టుకుని పార్టీని బలోపేతం చేయాలంటే సరైన నాయకుడు రాహుల్ గాంధీ అని పార్టీలో కీలక నాయకులు కోరుకుంటున్నారు. మరోపక్క మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో…. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికలు ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు, ఎన్నికల దాకా సోనియాగాంధీ అధ్యక్షురాలిగా ఉంటుందని టాక్. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో చాలా దయనీయంగా ఉందని మేధావులు అంటున్నారు.