ఎత్తులకు పైఎత్తులతో సాగే చదరంగం ఆట ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్టే ఉంటుంది. రాజకీయ చదరంగంలో కూడా పలుమార్లు పార్టీల మధ్య ఎత్తుకు పైఎత్తులు, సమీకరణాలు, నాయకుల ఆలోచనలు.. ఈ ఆటనే తలపిస్తాయి. ఇటివల జరిగిన రాజస్థాన్ రాజకీయం కూడా ఈ తరహాలోనే కొనసాగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అలజడి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, పీసీపీ అధ్యక్షుడు సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయడంతో రాజకీయం వేడెక్కింది. సచిన్ పైలట్ కూడా ఎక్కడా తగ్గలేదు. సీఎం గెహ్లాత్ కూడా ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే.. ఎప్పుడూ తన మాటే నెగ్గించుకునే అధిష్టానం ఒక మెట్టు దిగి సమస్య పరిష్కరించింది. ఈ వ్యవహారం మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానంలో వచ్చిన మార్పే హైలైట్ అని రాజకీయ నిపుణులు అంటున్నారు.
కాంగ్రెస్ లో మార్పు.. దేనికి సంకేతం..
బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో కాంగ్రెస్ ను గద్దె దించాలని సచిన్ పైలట్ ప్రయత్నాలు చేశాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అధిష్టానం. మళ్లీ మధ్యప్రదేశ్ రాజకీయం రాజస్థాన్ లో జరుగుతుందనే అంతా భావించారు. కానీ.. పరిస్థితులు ఎవరికీ అవకాశాన్ని ఇవ్వలేదు. ఈ రాజకీయాలపై బీజేపీ సముఖంగా లేకపోవడం ఒక కారణం. వసుంధరా రాజే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేదని సమాచారం. దీంత సచిన్ కు కూడా బీజేపీ నుంచి పెద్దగా అనుకూల సంకేతాలు రానట్టైంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా తన ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంది. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ గాలి లేకపోవటం.. ఎక్కడా అధికారం లేకపోవటం, కొన్ని రాష్ట్రాల్లో సంక్షోభాలను పరిష్కరించలేకపోవడంపై ఆలోచించింది. ఉన్న రాజస్థాన్ ను కాపాడుకోవటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్ ను వెనక్కు రప్పించడం.. ముఖ్యమంత్రి గెహ్లాత్ ను బుజ్జగించడం జరిగిందని తెలుస్తోంది.
మెట్టు దిగిన రాహుల్.. కారణం అదే..
కాంగ్రెస్ హైకమాండ్ తోపాటు రాహుల్, ప్రియాంక కూడా ఈ అంశంపై చకచకా పావులు కదిపారని తెలుస్తోంది. ఈ అంశంలో పార్టీ సీనియర్ నాయకులు సైతం చేసిన ట్వీట్లు వారిని ఆలోచనలో పడేశాయి. ఈ పరిస్థితుల్లో తగ్గడమే బెటర్ అని ఆలోచించింది. ఎక్కడా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా చేసింది. దీంతో కాంగ్రెస్ ను శాసించే గాంధీ కుటుంబం పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఒక అడుగు వెనక్కు వేసి సమస్య పరిష్కరించింది. దీంతో రాహుల్, గెహ్లాత్, సచిన్ మళ్లీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ కలిసిపోయారు. ఈ పరిణామంతో రాహుల్ తగ్గాడా.. సచిన్ గెలిచాడా.. అంటే.. అంతా సర్దుకుపోయారని చెప్పాలి.