కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం అంటారు. నిజమే. కాంగ్రెస్ లో నాయకులే కాదు.. కార్యకర్తకు కూడా ఫ్రీడం ఉంటుంది. అది ఏస్థాయి అంటే.. ఎవరికి వారు నేనే లీడర్ అనేంతగా. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ దీనిని మాత్రం మార్చలేకపోయింది. ఎంతో ప్రాభవం ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంక్షోభంలో ఉంది. నాయకత్వ లేమి స్పష్టంగా ఉంది. ఇందులో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. అగ్ర నాయకులు పార్టీ వీడటం, ఎన్నికల్లో వరుస ఓటములు.. పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని దెబ్బ తీశాయి. అయినా.. కింద పడ్డా తనదే పైచేయి అన్నట్టుంది కాంగ్రెస్ పరిస్థితి. వరుస ఓటముల నుంచి పాఠాలు నేర్వాల్సింది పోయి.. ఇంకా పదవుల కోసం పాకులాడటం విచిత్రంగా ఉంది.
ఓటమి నుంచి నేర్చుకునేదెప్పుడు..
దుబ్బాక ఓటమి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటములు కాంగ్రెస్ పునరాలోచనలో పడేశాయి. దీంతో టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉత్తమ్ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ పదవి కోసం పోటీ నెలకొంది. ఇందుకు ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయం తీసుకుంటే వారి ఆధ్వర్యంలో పని చేసి పార్టీని పటిష్టం చేసి ప్రజల్లోకి వెళ్లాలన్న ఆలోచన వారికి ఉండటం లేదు. నేనే సీనియర్, నాకు క్యాడర్ ఎక్కువ.. పదవి నాకే దక్కాలి.. లేదంటే పార్టీ వీడేందుకు కూడా సిద్ధం అనేలా ఉన్నారు. పార్టీకి ఓట్లు రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రజల్లో నమ్మకం కలిగించాల్సంది పోయి ఇంకా పదవుల కోసం పోటీ పడటం తగని పనే. నాయకుల తీరుతో కార్యకర్తల్లో అయోమయం నెలకొనే పరిస్థితులు ఉన్నాయి.
సీనియర్లు పార్టీకి సహకరిస్తారా..
పార్టీలో కష్టపడిన వారికి పదవులు దక్కడం ముఖ్యమే. ఇందుకు ఆశ పడటంలో కూడా తప్పు లేదు. కానీ.. రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో పోటీలు పడటం పార్టీకి మంచిది కాదు. పైగా ఇన్నాళ్లూ వారికి రాష్ట్రంలో టీఆర్ఎస్ మాత్రమే శత్రువు. జాతీయస్థాయిలో బీజేపీతో వైరం ఉంది కానీ.. ఇన్నాళ్లూ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు బీజేపీ వరుస విజయాలతో పోటీకి వచ్చింది. టీఆర్ఎస్-బీజేపీ ఒకరికొకరు పోటీ పడితే.. కాంగ్రెస్ మాత్రం వీరద్దరితో ఎదురీది గెలవాల్సి ఉంది. మరి టీపీసీసీ రేసులో ఉన్న శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి.. వీరితోపాటు మేమున్నాం అంటున్న వీహెచ్, జీవన్ రెడ్డి వంటి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.