అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వివాదాలు పరిపాటిగా మారాయి. తిరుమలలోని వివాదాలపై వివిధ రాజకీయ పక్షాలు, హిందూ మత సంఘాలు నిరసనలు నిర్వహించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది.
వివాదానికి కారణమైన లవకుశుల కధ
టీటీడీ సప్తగిరి మాస పత్రికలో ముద్రించిన రామాయణంలోని లవకుశ కథ ఇప్పుడు వివాదంగా మారింది. అందులో సీతకు లవుడు మాత్రమే కుమారుడని, కుశుడు దర్బతో రాసిన బొమ్మ అంటూ ప్రచురించారు. ఈ కథను తిరుపతికి చెందిన ఓ బాలుడు రాసినట్లు తెలుస్తున్నది. అయితే దీనిపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వివాదంపై విచారణ
కాగా ఈ విషయంపై టీటీడీ విజిలెన్స్ రంగంలోకి దిగింది. సప్తగిరి మాస పత్రిక ఎడిటర్ రాధా రమణ, ఎడిటర్, సబ్ ఎడిటర్లను విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు.
సప్తగిరి ఎడిటర్ ను తొలగించాలి
ఇక ఈ వివాదంపై టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. ఏ గ్రంధం ప్రాతిపదికన దీన్ని ప్రచురించారో తెలపాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. టీటీడీ వంటి ధార్మిక సంస్థ.. వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకోవలసి ఉంటుందని భానుప్రకాష్ రెడ్ది సూచిస్తున్నారు. సప్తగిరి మాస పత్రిక ఎడిటర్ రాధా రమణను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
దిద్దుబాటు చర్యలు
ఈ వివాదం నేపథ్యంలో టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టీటీడీ వెబ్సైట్లో వివాదాస్పద లవకుశుడి కథనాన్ని తొలగించింది. అలాగే ముద్రించిన పుస్తకాలను ప్రిటింగ్ ప్రెస్ నుంచి భక్తులకు పంపిణీ చేయకుండా నిలుపుదల చేశారు.
టీటీడీ భూముల వేలం వ్యవహారం ఇటీవల పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. టీటీడీకి సంబంధించిన పలు నిరర్ధక భూములను అమ్మేందుకు సంస్థ సిద్ధం అవ్వగా రాజకీయ పార్టీల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో భూముల వేలం నిర్వహించడం లేదంటూ అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చిన విషయం విదితమే