రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ముందుకు సాగడం లేదు. ఒక పక్క స్థానికంగా సమస్యలు, మరో పక్క కోర్టు వివాదాలు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రతిబంధకంగా మారుతున్నాయి. ప్రధానంగా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వానికి కోర్టుల నుండి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థాయిలో సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే పార్టీపై, ప్రభుత్వంపై పడుతున్న మచ్చ చెరిగిపోదు. తాజాగా సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనైనా ప్రభుత్వం ఇళ్ల పట్టాల విషయంలో సమీక్ష చేసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
అమరావతిలోనే ఎందుకు ఇస్తున్నట్లు.. మంత్రులు ఎలా సమర్ధించుకుంటారు
రాజధాని నిర్మాణాల కోసం అంటూ అమరావతి ప్రాంతంలో గత ప్రభుత్వం హయాంలో దాదాపు 33వేల ఎకరాలకు పైగా భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్న విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తిగా నిలిపివేసింది. మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం వేరే ప్రాంతాలకు చెందిన పేదలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ప్రాంత రైతులు వ్యతిరేకించినప్పటికీ అధికార యంత్రాంగం ఇళ్ల పట్టాల పై అడుగులు ముందుకే వేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాల వ్యవహారం కోర్టుకు చేరింది. అయితే రాజధాని నిర్మాణాలకు అమరావతి ప్రాంతం ఆమోదయోగ్యం కాదని, ముంపు ప్రాంతమని మంత్రులే వ్యాఖ్యానించారు. అదే విధంగా అమరావతి ప్రాంతం ఎడారి అని, స్మశానం అని కూడా కామెంట్స్ చేశారు. అప్పుడు ఆలా వ్యాఖ్యలు చేసిన మంత్రులు ఆ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ అంటూ ఎలా సమర్ధించుకుంటారో మరి.
జగన్ రంగంలోకి దిగాల్సిందేనా? సమీక్ష చేయాల్సిందేనా?
అమరావతి ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబందించిన ఈ కీలక విషయంలో మంత్రులు తలోరకంగా మాట్లాడటం, కోర్టులలోనూ బలమైన వాదనలు వినిపించడంలో విఫలం అవుతుండటం సీఎం జగన్ కు చిరాకు కల్గిస్తున్నాయట. ఈ వ్యవహారం జటిలంగా మారిన నేపథ్యంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరిపి అమరావతి ఇళ్లపట్టాల విషయంలో ఎదో ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అమరావతి విషయంలో వెనక్కు తగ్గడమా? లేక అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు పంపిణీ చేయాల్సి వస్తుందో సమర్ధవంతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అమరావతి ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం త్వరగా స్టెప్ తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రతిపక్షాలు యత్నించే అవకాశం ఉంది.