BJP Party: బీజేపీ BJP Party కరోనా అల్లకల్లోలంతో దేశం మొత్తం అట్టుడికిపోతోంది. ఏమాత్రం అదుపులోకి రాని పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. కేంద్రం తాను చేయక రాష్ట్రాలతో లాక్ డౌన్ పెట్టించే పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. నిన్నటివరకూ దేశంలో తెలంగాణ మాత్రమే లాక్ డౌన్ విధించకపోగా.. నేడు ఆ రాష్ట్రం కూడా లాక్ డౌన్ కౌగిట్లోకి వెళ్లిపోయింది. మొత్తం అందరూ ప్రధాని మోదీ వైపే చూస్తున్నారు. వైరస్ వ్యాప్తికి, వ్యాక్సిన్ కొరతకు కేంద్రం విధానాలే కారణమని.. అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో బీజేపీ నేతల హడావిడి తగ్గిపోయింది. కేంద్రం విధానాలను, బీజేపీ పెత్తందారీని విమర్శిస్తే, మోదీ-షాలను ప్రశ్నిస్తే వారిపై దేశద్రోహమే అనే స్థాయిలో బీజేపీ తీరు ఉండేది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా సైలంట్ అయిపోయారు.
తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే.. అధికార పార్టీ, ఇతర పార్టీలపై ఏమాత్రం అవకాశం చిక్కినా విరుచుకుపడే నాయకులు ఇప్పుడు గమ్మునుండిపోతున్నారు. మోదీపై విమర్శలు వస్తున్నా గట్టిగా బదులివ్వలేని పరిస్థితి. పోనీ.. రీసెంట్ గా రెండు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. అభ్యర్ధుల గెలుపు కోసం శ్రమించారు. కానీ.. రెండు చోట్లా బీజేపీకి ఘోర పరాభవమే ఎదురైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నుంచి ఎన్నో తీసుకొస్తామన్న పార్టీ పెద్దలు ఇప్పుడు మౌనమే వహిస్తున్నారు. ఇక ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కేంద్రానికి నివేదిస్తామని చెప్పిన నాయకులకు ఢిల్లీలో మోదీ, షా అపాయింట్ మెంట్లే దొరకలేదు. ఇక ఏపీకి అందించే వ్యాక్సిన్, ఆక్సిజన్ సాయంపై చొరవ తీసుకుంటారని చెప్పలేం.
అయితే.. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. కానీ.. రెండు రాష్ట్రాల్లోని పార్టీ పెద్దలు రాష్ట్రాలకు అందాల్సిన సాయంపై స్పందించట్లేదనేది నిజం. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, వైఫల్యాలపై స్పందించడమే జరుగుతోంది కానీ.. క్షేత్రస్థాయిలో రాష్ట్రాలకు సాయం చేయడంలేదు. బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, రాజా సింగ్, సోము వీర్రాజు, పురందేశ్వరి, జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేశ్, రత్నప్రభ.. వీళ్లంతా కేంద్రంపై తమ కరోనా విషయంలో రాష్ట్రాల కోసం పాటుపడుతోంది ఏమీ లేదనే చెప్పాలి. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ వంటివారు మాత్రం వారి రాష్ట్రాల కోసం కేంద్రంలోని పెద్దలతో మాట్లాడుతున్నారు. మరి.. తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ఈ విషయంలో శ్రద్ధ పెడతారా?