అమరావతి: ప్రభుత్వం గిరిజనులకు పోడు భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో మంగళవారం సిపిఐ నేతలు సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎకరాకు లక్షా 15 వేల రూపాయలు పొందిన రైతులకు అయిదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు రైతులకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువ రైతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకెజీ వర్తింపజేయాలని ఆయన అన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిర్వాసితులంతా ఐక్యంగా పోరాటం చేయాలని నారాయణ పిలుపు నిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.