(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: రాజధాని విషయంలో సిఎం జగన్మోహనరెడ్డి వ్యవహరిస్తున్న తీరును సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలా మారుమోగిందో అలాగే అమరావతి ఆంధ్రుల హక్కుగా 13 జిల్లాలల్లో ఒక నినాదంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధానికి చూపించేందుకే నాలుగు కమిటీల రిపోర్టులనీ ఈ మెంటల్ రిపోర్టులను పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ నారాయణ వ్యాఖ్యానించారు.
అమరావతి ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేసిన నారాయణ.. ప్రధాని వేసిన బిల్డింగ్ పునాది కదలదని అన్నారు. కేసుల విషయంలో మాత్రం జగన్ వెసులుబాటు కోరతారని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన కన్నా పెద్ద రాజకీయ ఉప్పెన నేడు అమరావతిలో వచ్చిందని అన్నారు. పకృతి వైపరీత్యాలు సహజం కానీ ఇది రాజకీయ విపత్తని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. అమరావతికి కృష్ణా వరద ముప్పు అంటుండటంపై హుద్ హుద్ తుఫాను విశాఖను కుదిపేయలేదా అని నారాయణ ప్రశ్నించారు.
హుందాగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. జగన్ అమరావతి రాగానే దృతరాష్ట్రుడిలా, అసెంబ్లీలో ధుర్యోధనుడిలా మారతారనీ, మంత్రులు కల్లుతాగిన కోతుల్లా మాట్లాడుతున్నారనీ నారాయణ దుయ్యబట్టారు.